Telugu News: అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం (జూన్ 16) వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందనలు తెలిపారు. రాజధాని అభివృద్ధిగురించి నారాయణ మీడియాతో మాట్లాడారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరగబోతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉన్నందున.. రెండున్నరేళ్లలో మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 


పురపాలికల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను  రైతులు అందజేశారని గుర్తు చేశారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారని.. గతంలో రూ.48 వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించామని అన్నారు. రూ.9 వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు.


‘‘అమరావతిలో అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి రాజధానిని (Amaravati) అభివృద్ధి చేసే బాధ్యతను నాపై ఉంచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాను. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపింది. చెత్త పన్నుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూ.11 లక్షల ఖర్చుతో టిడ్కో ఇళ్లు నిర్మించాం. వాటిని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు పని చేస్తాం’’ అని పొంగూరు నారాయణ మాట్లాడారు.