కోనా రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ స్థానికి ఏకగ్రీవంగా కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం ఎన్నికైనట్టు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. కోలగట్ల వీరభద్ర స్వామి ఒక్కరే నామినేషన్ వేసినందుకు ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు సభాపతి సీతారాం వెల్లడించారు. 


అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్ల వీరభద్ర స్వామిని సభాపతి కుర్చీలో సీఎం జగన్‌తోపాటు ఇతర సభ్యులు కూర్చోబెట్టారు. ఆయనకు ఒక్కొక్కరుగా వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారు. 


కోనా రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ స్పీకర్‌ పోస్టుకు కోలగట్ల వీరభద్ర స్వామి ఒక్కరే  నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఆయన పేరును వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు కోరుముట్ల శ్రీనివాస్, మహీధర్‌ రెడ్డి ప్రతిపాదించారు. దీనిపై ఇవాళ ఎన్నిక జరిగాల్సి ఉంది. కానీ ఒకే నామినేషన్ పడినందున ఆయన ఎన్నికల లాంఛనమైంది. 


తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సభలో చర్చ నడిచింది. దీనిపై చర్చను వైసీపీ సభ్యురాలు పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఎంతో రాజకీయా అనుభవం ఉన్న వ్యక్తికి రాజ్యాంగబద్దమైన గౌరవాన్ని కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారామె. సభలో స్పీకర్‌ స్థానం తండ్రిలాంటిని... ఆ స్థానంలో కోలగట్ల లాంటి వ్యక్తి కూర్చోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయనగరం చరిత్రలో ఇలా రాజ్యాంగబద్దమైన స్థానంలో కూర్చునే అవకాశం ఇప్పటి వరకు రాలేదని... ఇప్పుడు దక్కిందన్నారు. 


ఉత్తరాంధ్ర అంటే జగన్‌కు ప్రత్యేక అభిమానమని.. అందుకే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చారన్నారు పుష్పశ్రీవాణి. ఎంత విధేయతతో జగన్ వెంటన నడిచారో అంతే విలువ కోలగట్లకు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఇద్దరి మధ్య చాలా దృఢమైన అనుబంధం ఉందన్నారు. కచ్చితంగా సభ నిర్వాహణలో విజయవంతమవుతారని ఆశించారు. మాస్‌ లీడర్‌ క్లాస్‌ సభను నడిపించడం చాలా పెద్ద పని కాదన్నారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తారన్నారు. ప్రజల గొంతును వినిపిస్తారన్నారు. సభాస్థానానికి చిన్న మచ్చ తేకుండా సభను నడిపిస్తారన్నారు. 


డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల ఎంపిక కావడం సభ గౌరవాన్ని పెంచిందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ సభలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూడా ఉత్తరాంధ్రవాసులని గుర్తు చేశారు. నిరంతరం ప్రజలతో ఉంటే కోలగట్ల ఈ పదవిని విజయవంతంగా నిర్వహిస్తారన్నారు. ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు పరిష్కారం కావాలన్న లక్ష్యంలో విజయం సాధిస్తారన్నారు. 


డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్లను ఎంపిక చేసిన సీఎంకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏ నమ్మకంతో నియమించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టి పేరు తీసుకురావాలన్నారు. 


కోలగట్ల ఎంపికను తెలుగుదేశం కూడా స్వాగతించింది. విశేష అనుభవం ఉన్న వ్యక్తిగా సభను సజావుగా నడుపుతారని ఆశించారు ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు. ఇవాల్టి నుంచి రాజకీయా పార్టీతో కోలగట్లకు సంబంధం లేదని... అధికార, ప్రతిపక్షాన్ని సమానంగా చూసి ప్రజాసమస్యలపై చర్చిస్తారని ఆశించారు. స్పీకర్‌ ఒకవైపే చూస్తున్నారని... డిప్యూటీ స్పీకర్ రెండు వైపులు చూసి అవకాశాలు ఇవ్వాలన్నారు. 


డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్లను సీఎం జగన్ అభినందించారు. ఇంతకు ముందు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘుపతి రెండున్నరేళ్లుగా పని చేశారని గుర్తు చేశారు. వేరే సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అడిగితే ఆయన అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా అందరికీ న్యాయం చేయాలని ఆశిస్తూ మంచి జరగాలన్నారు. 


డిప్యూటీ స్పీకర్‌గా తనను ఎన్నుకున్న వారికి కోలగట్ల వీరభద్రస్వామి కృతజ్ఞత తెలిపారు. ఐదు నెలల క్రితమే నిర్ణయం జరిగిన శాసనసభ సమావేశాలు లేనందున ఆలస్యమైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ తనను ఈ స్థానంలో కూర్చోబెట్టారన్నారు. సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు ప్రవర్తించాలని సూచించారు. తమ మాటే చెల్లుబాటు కావాలని ప్రవర్తించే సభ్యులు కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అందరూ సభా నిర్వాహణలో పాలుపంచుకున్నప్పుడే సభ సజావుగా నడపగలమని గ్రహించాలన్నారు. సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం కోరుతున్నట్టు వెల్లడించారు. సభలో కంటిన్యూగా ఉంటే కచ్చితంగా ప్రతిపక్షం వైపు చూస్తామన్నారు డిప్యూటీ స్పీకర్‌. తాను సభలో మాత్రమే డిప్యూటీ స్పీకర్‌ను అని... బయట మాత్రం వైసీపీ సభ్యుడినే అన్నారు.