టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం, చంద్రబాబు వేసిన పిటిషన్ పై విచారణ జరపనుంది. ఈ నెల 3న తేదీన ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు చంద్రబాబుపై నమోదు చేసిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌నెట్‌ కేసుల్లో బెయిల్‌ పిటిషన్‌లపై సోమవారం హైకోర్టు తీర్పులు ఇవ్వనుంది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.


17ఎ సెక్షన్‌ను అనుసరించలేదు
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా, ఏపీసీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఎ సెక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. 2021 సెప్టెంబరు 7న స్కిల్‌ సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు డిసెంబరు 9న కేసు నమోదుచేశారని, దీనికి గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ 2018లో 17ఎ సెక్షన్‌ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్‌ అనుమతి అవసరం లేదని, ఏపీసీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులూ అదనపు పత్రాలు సమర్పిస్తూ ఐఏ దాఖలుచేశారు. చంద్రబాబు అరెస్టయ్యి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టీ సోమవారం సుప్రీం ఇవ్వబోయే ఆదేశాలపైనే ఉంది.


స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏంటి ?
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 


240 కోట్లు మళ్లించారన్న సీఐడీ
దాదాపు రూ. 240 కోట్లు షెల్ కంపెనీల‌కు మ‌ళ్లించిన‌ట్టు ఏపీ సీఐడీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన రూ. 370 కోట్లలో రూ.240 కోట్లను వేర్వేరు షెల్‌ కంపెనీలకు మళ్లించిన‌ట్టు సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు నిధులు వెళ్లాయని సీఐడీ అంటోంది. నాడు సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్‌గా ఉన్న సుమన్‌ బోస్, డిజైన్‌టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ క‌న్విక‌ర్ ద్వారా కుంభ‌కోణం న‌డిపించిందని సీఐడీ ఆరోపిస్తోంది. రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓయూ చేసుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. జీవోలో మాత్రం రూ.3300 కోట్ల ప్రస్తావనను తొలగించింది. చివ‌ర‌కు రూ.240 కోట్ల రూపాయలను షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించేశారని సీఐడీ ఆరోపిస్తోంది.