సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా అడుగులేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారంచుడుతోంది. సుస్థిర ప్రగతి కోసం తీసుకుంటున్న చర్యల్లో హరిత విధానాలకు పెద్దపీట వేయడం, తద్వారా అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత సాధించడం తదితర కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని కోసం గ్లోబల్‌ అలియన్స్‌ ఫర్‌ సస్టయిన్‌బుల్‌ ప్లానెట్‌ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్‌ చర్చలు జరిపారు. 


వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్‌ప్రాజెక్టు కింద విశాఖపట్నంలో చేపట్టాలని నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానమై ఈ ప్రాజెక్ట్‌ చేపట్టాలని ఆదేశించారు. తద్వారా బీచ్‌లను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇతర అంశాలపైనా కూడా తగిన ప్రణాళికలు రూపొందించి నివేదించాలన్నారు. 


ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్‌పై జీఏఎస్‌పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్‌, పార్లీ ఫర్‌ ది ఓసియన్స్‌ ఫౌండర్‌ సైరిల్‌ గట్చ్‌ ఈ ప్రాజెక్టు వివరాలను సీఎంకు తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో సముద్రాలు కలుషితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి సముద్రాలను... తద్వారా భూగోళాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  ఈ వ్యర్థాలను పర్యావరణ అనుకూలంగా రీసైకిల్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 


ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 150 మిలియన్‌ టన్నుల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వస్తే వాటిలో కేవలం 9శాతం మాత్రమే రీ సైక్లింగ్‌ చేస్తున్నారని, మిగతావన్నీ కూడా కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని వివరించారు సైరిల్ గట్చ్‌. ఈ వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారులు వేసినట్టువుతందన్నారు. ప్రకృతికి అనుకూలంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సరికొత్త ఆర్థిక వ్యవస్థతో మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. జీఏఎస్‌పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న విలువైన ఉత్పత్తులు భవన నిర్మాణ మెటీరియల్, ఫర్నిచర్, వస్త్రాలు, షూలు ముఖ్యమంత్రికి వివరించారు. 


పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రతి ఇంటి నుంచీ సేకరిస్తున్న వ్యర్థాలను ప్రాసెస్‌ చేస్తున్న విధానాన్ని పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏఎస్‌పీ ప్రతినిధులకు వివరించారు. విశాఖను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసుకోవాలని సీఎం అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలవుతున్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని అనుసంధానంచేసుకుంటూ విలువైన ఉత్పత్తుల తయారీని చేపట్టడంతోపాటు, బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖపట్నంలో దీన్ని అమలు చేసి ఫలితాల ఆధారంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించాలన్నారు. 


ఎకో టూరిజంపై ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను జీఏఎస్‌పీ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో అరుకు, అనంతగిరి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎకోటూరిజం విస్తృతి, అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై తగిన ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. స్థానికులకు మంచి ఆదాయాలను ఇచ్చేదిగా ఈప్రణాళిక ఉండాలన్నారు. 


కర్బన వ్యర్థాలతో సారవంతంగా నిరుపయోగ భూములను మార్చడంతోపాటు, సేంద్రీయ సహజ వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి అంతర్జాతీయ మార్కెటింగ్‌ తదితర అంశాలపైనా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. 


ఇంకా సీఎం ఏమన్నారంటే.. " మనం కలెక్ట్‌ చేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తిరిగి ఉపయోగపడేలా చేయడం చాలా మంచి పరిణామం. సముద్రతీరాలను శుభ్రం చేయడం, మరింత అందంగా తయారు చేయాలన్నది మంచి విధానం. ఇందులో మంచి అనుభవమున్న మీరు...అంతర్జాతీయంగా ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏపీలో మేం ఇప్పటికే ఇలాంటి వ్యర్ధాల కలెక్షన్‌పై స్పష్టమైన విధానాన్న అనుసరిస్తున్నాం. నాన్‌ బయోడిగ్రీడబుల్‌ మెటీరియల్‌ను ఎలా రీ సైక్లింగ్‌ లేదా రీయూజ్‌లోకి తేవాలన్న దానిపై సీరియస్‌గానే ఆలోచన చేస్తున్నాం. అందుకు మల్టీనేషనల్‌ స్ధాయిలో పని చేస్తున్న మీలాంటి వారి అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇది ఓ మంచి ప్రయత్నం అని సీఎం జగన్ అన్నారు.