ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు (ఏప్రిల్ 6) ఉదయం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. విశాఖ – భోగాపురం బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహా మేరకు అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతో పాటు, పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు.


విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. ఈ భూములను కూడా ప్రభుత్వం గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని సీఎం కోరారు.







విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధం చేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ గడ్కరీని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరు చేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 


రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వేల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించిందని.. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించిందని సీఎం తెలిపారు. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని జగన్‌ కోరారు.