Jagananna Pala Velluva: కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ ప్రారంభం.. ఈ పథకం ప్రయోజనాలు ఏంటంటే..
గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు ఆర్థిక దన్ను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.

కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు ఆర్థిక దన్ను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభించనుందని తెలిపారు. గతేడాది నవంబర్లో అమూల్ సంస్థతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. క్రమంగా ఈ పథకం రాష్ట్రమంతటా విస్తరిస్తుంది. జనవరిలో అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ఇప్పటికే తయారు చేసింది.
ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జిల్లాలో పాడి రైతులు, మహిళలకు ఈ పథకం ద్వారా మెరుగైన ధర లభిస్తుందని అన్నారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాల వెల్లువ కార్యక్రమం ప్రారంభమైందని జగన్ చెప్పారు. అమూల్ సంస్థ ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, కడప జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు వారు చెల్లిస్తున్నారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చిందని అన్నారు.
Also Read: Online Betting: ఫోన్లో ఈ పద్ధతిలో గేమ్స్ ఆడుతున్నారా? జాగ్రత్త.. ! ఇతనివి రూ.6.7 లక్షలు హాంఫట్
పాదయాత్రలో పాడి రైతుల సమస్యలు చూశా: జగన్
తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేసినప్పుడు పాల ధర తక్కువగా ఉందని రైతులు గోడు పెట్టుకున్నారని జగన్ గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి రాగానే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేపట్టామని చెప్పారు. అమూల్ సంస్థ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ అని చెప్పారు. ‘‘ప్రపంచంలో అమూల్ 8వ అతి పెద్ద సంస్థ. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప ప్రక్రియ కూడా అమూల్లో ఉంది. పాల బిల్లును కూడా పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏడాదిలో 182 రోజులు సొసైటీకి పాలు పోసిన రైతులకు బోనస్ కూడా లభిస్తుంది. లీటర్కు 50 పైసలు చొప్పున బోనస్ కూడా ఇస్తారు’’ అని సీఎం జగన్ వివరించారు.
రోజుకు సగటున 75 వేల లీటర్ల పాలు సేకరణ
‘‘గతేడాది నవంబర్లో జగనన్న పాలవెల్లువ కింద కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిధిలో 71,373 లీటర్ల పాలను సేకరించారు. ఈ ఏడాది నవంబర్లో ఐదు జిల్లాల పరిధిలో ఏకంగా 21,57,330 లీటర్ల పాలు సేకరించారు. రోజూ 30,640 మంది రైతుల నుంచి సగటున 75 వేల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తున్నారు. ప్రైవేటు డెయిరీలు కొవ్వు, వెన్న శాతాలను తగ్గిస్తూ ధరలో కోత పెడుతుంటే జగనన్న పాల వెల్లువలో మాత్రం గరిష్ఠంగా లీటర్ గేదె పాలకు రూ.74.78, ఆవు పాలకు రూ.35.36 చొప్పున చెల్లిస్తున్నారు.’’ అని జగన్ తెలిపారు.
Also Read: పవన్ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
Also Read: Anandayya Medicine: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి