YSR Kalyanamastu YSR Shaadi Tofa funds Realeased: ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధుల విడుదల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో నామమాత్రంగా ఉన్న పథకాన్ని తాము బాగు చేశామని అన్నారు. ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే నిధులు ఇచ్చేట్టుగా మార్చామని అన్నారు. గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశామని వివరించారు.


ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోంది. వైయస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం. దీని వల్ల కచ్చితంగా ఈ స్కీమ్‌లో ఎలిజబులిటీ రావాలంటే కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుంది. 


18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల పదో తరగతి ముందే 15 ఏళ్లు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్‌కు పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మ ఒడి ద్వారా మంచి జరుగుతుంది. కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. 


ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది.  అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఇస్తున్నాం. ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నాం. కచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్ లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు. మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. 


గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఇది నామ్ కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోయాం. గతంలో 40 వేలకు పరిమితమైన ఎస్సీలకు రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతా పెళ్లి అయితే రూ.1.20 లక్షల వరకు తీసుకుపోయాం. ఎస్టీలకు రూ.50 వేలకు పరిమితమైతే రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల దాకా తీసుకుపోయాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంటే దాన్ని రూ.50 వేల వరకు తీసుకుని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని రూ.75 వేల దాకా తీసుకుపోయాం’’ అని సీఎం జగన్ అన్నారు.