Amaravati Latest News: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (జూన్ 13) సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల హామీలపై తొలి సంతకాలు పెట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టగానే.. 5 ఫైల్స్ పై సంతాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. గురువారం అన్ని పనులు ముగించుకొని అనంతరం ఇంటికి వెళుతున్న చంద్రబాబు నాయుడు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపారు. కారు దిగి ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులను స్వయంగా పలకరించారు. సీనియర్ రిపోర్టర్లను పేర్లతో పలకరించి ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు అని ఆప్యాయంగా అడిగారు. 


దీంతో విలేకరులు ఆశ్చర్యపోయారు. 5 ఏళ్ల తరువాత తాము సీఎంను కలిశామని.. స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉండే తాము గత 5 ఏళ్లుగా సీఎంను కనీసం కలవలేకపోయామని.. పాలనా అంశాలపై కూడా మాట్లాడలేదని రిపోర్టర్లు అభిప్రాయపడ్డారు. సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము 5 ఏళ్ల తరువాత సీఎంను కలిశామని నవ్వుతూ అన్నారు. ఇక నుంచి మీకు చాలా పని ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి వారితో అన్నారు. పాలనలో సమూల మార్పు ఉంటుందని.. అన్ని చోట్లా మార్పు ఉండబోతుందని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ కలుద్దాం అంటూ ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.