AP News: రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ సంక్రాంతి పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించింది. అదే రోజు 56 కార్పరేషన్లుకు ఛైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్ కు 12 మంది చొప్పున డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వెనుకబడిన తరగతులకు ఆర్థిక చేయూత అందించడంలో వెన్నుముకగా నిలబడాలనేది ఈ కార్పొరేషన్ల లక్ష్యం. ఇవాల్టితో వారి పదవీ కాలం ముగిసింది. బడుగు బలహీన వర్గాలు స్వశక్తితో నిలబడేలా ఆర్థికంగా చేయూతనివ్వడం, ఉపాధి కల్పించడం బీసీ కార్పొరేషన్ల లక్ష్యం. కుల వృత్తులు చేసుకుంటూ తరతరాలుగా పేదరికంలో మగ్గుతున్న వెనుక బడిన తరగతుల వారిని పేదరికం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు ఈ కార్పొరేషన్లు నియమించారు. 


ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుందని ఆసక్తి నెలకొంది. వారినే కొనసాగిస్తారా.. లేకుంటే కొత్త వారిని నియమిస్తారా అని చర్చ నడుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి పార్టీ లీడర్లతో సమావేశం కానున్నారు. ఇది గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో చేపట్టే సమీక్ష అయినా ఈ బీసీ కార్పొరేషన్లపై ఏమైనా చర్చ జరగొచ్చా అనే టాక్ వినిపిస్తోంది. 


ఈ కార్పొరేషన్లతో బీసీలు తల ఎత్తుకునేలా చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అసలు ఏమీ చేయలేదని దుమ్మెత్తి పోస్తున్నాయి. పథకాలతో మాయ చేస్తున్నారనే తప్ప శాశ్వతంగా బీసీలు పేదరికం నుంచి బయట పడేందుకు ఎలాంటి కార్యక్రమాలు లేవంటున్నారు. ఎలాంటి అధికారాలు లేని బీసీ కార్పొరేషన్లు దేని కోసమని ప్రశ్నిస్తున్నారు. ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లు వైసీపీ ప్రభుత్వం నామ మాత్రంగా మార్చేసిందని ఆరోపిస్తున్నాయి. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఘనంగా ప్రకటిండమే తప్ప.. గత ప్రభుత్వాలతో పోలిస్తే స్వయం ఉపాధి కింద చాలా తక్కువ రుణాలు ఇచ్చిందంటున్నారు. 


తమ హయాంలో నాలుగేళ్లలో స్వయం ఉపాధికి రూ.1,626 కోట్ల రుణాలు ఇచ్చామని టీడీపీ ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం తాము ప్రాధాన్యంగా భావించిన రేషన్ పంపిణీ వాహనాలకు రూ.132 కోట్లు రాయితీగా ఇచ్చి మమ అనిపించిందన్నారు. పైగా గత ప్రభుత్వం బీసీలకు రాయితీ రుణాల కింద ఇచ్చి.. బ్యాంకుల్లో మిగిలిపోయిన రూ.200 కోట్లనూ వెనక్కు తీసుకుంటుందని ఆరోపించారు. టీడీపీ హయాంలో అన్ని కార్పొరేషన్ల ద్వారా అందించి, ఖర్చు కాకుండా మిగిలిపోయిన రూ.488 కోట్లు బ్యాంకుల్లో ఉందన్నారు. 


బీసీలకు స్వయం ఉపాధి కల్పన ద్వారా శాశ్వతంగా పేదరికాన్ని దూరం చేసేందుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.  అన్ని పథకాల్లోని బీసీలకు ఇచ్చే వాటాను పక్కకు తీసి పెద్ద మొత్తంలో సాయాన్ని అందిస్తున్నట్లు అంకెల గారడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా చూపిస్తూ తిమ్మిని బమ్మిని చేస్తున్నారన్నారు. 


ఈ ఆరోపణలను తిప్పికొడుతున్న ప్రభుత్వం గతవారంలో విజయవాడ వేదికగా జయహో బీసీ పేరుతో భారీ బహిరంగ సభ పెట్టింది. ఇందులో మాట్లాడిన సీఎం జగన్... బీసీల తన గుండెల్లో ఉన్నారంటూ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అదే స్టేజ్‌పై చంద్రబాబుపై విమర్శలు చేశారు.


బీసీలంటే ఇస్త్రీపెట్టెలు, కుట్టుమిషన్లు కావని చంద్రబాబుకు చెప్పండని విమర్శించారు జగన్. 2014లో బీసీలకు ఏకంగా 114 వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఉన్న విషయాన్ని బాబుకు చెప్పండన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న జగన్‌కు వెన్నెముక కులాలుగా మారామని చెప్పండన్నారు. రాజ్యాధికారంలో భాగస్వాములు అని గర్వంగా చెప్పాలన్నారు. వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన విషయాన్ని గుర్తు చేయండన్నారు. ఫీజు రిఎంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఉన్న దుస్థితిని చంద్రబాబుకు గుర్తు చేయాలన్నారు. కేసీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని చెప్పి మాట తప్పిన సంగతి గుర్తు చేయాలన్నారు. సబ్‌ప్లాన్ ద్వారా పదివేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బీసీలకు చేసిన ద్రోహాన్ని  చంద్రబాబుకు గుర్తు చేయాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయామని అడిగితే  అంతు చూస్తానంటూ మత్స్యకారులకు, తోకలు కత్తిరిస్తామని నాయీబ్రాహ్మణులకు చెప్పన మాటలు గుర్తు చేయమన్నారు. అయ్యా బాబు.. మాకు తోకలు లేవు కానీ.. మీ తోకలను మీకు మొలిచిన కొమ్ములను, కొమ్ముకాసే వారిని కత్తిరించే చైతన్యం ఉందని గట్టిగా చెప్పాలన్నారు.