జనసేన అధినేత పవన్ తాజా కామెంట్స్‌పై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. పవన్ కాపులను కట్టకట్టి చంద్రబాబు దొడ్లో కట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాత్రమేనని తన నియోజకవర్గంలో మాత్రం కాపులు తనకు మాత్రమే ఓటు వేస్తారని అంబటి అంటున్నారు.


పవన్ ప్రభావం తన నియోజకవర్గంలో మాత్రం ఉండే అవకాశం లేదని అన్నారు అంబటి. తన నియోజకవర్గంలోని కాపులంతా తన వెంటనే ఉన్నారని వ్యాఖ్యానించారు. కాపులను కేంద్రంగా చేసుకొని జనసేన అధినేత పవన్ చేస్తున్న రాజకీయంలో పవన్ అభిమానులు, బలి కాబోతున్నారని అన్నారు. పవన్ వ్యాఖ్యలతో ఆయన అభిమానులకు కనువిప్పు కావాలని అంబటి పిలుపునిచ్చారు. కాపు కులంలో ఉన్న వారంతా తమ కులానికి చెందని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించారని, అయితే పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు పని చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని తాము ఎప్పటి నుండో చెబుతున్నామని పవన్ చేసిన వ్యాఖ్యలతో కాపులంతా ఆలోచించాలని అంబటి అన్నారు. తన నియోజకవర్గంలో తాను మాత్రం సేఫ్ అని అభిప్రాయపడ్డారు. 


తన నియోజవకర్గంలోని కాపులు తన వెంటనే ఉన్నారని, తనకు మాత్రమే తిరిగి ఓటు వేస్తారని అంబటి ధీమా వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు డబ్బులు భారీగా పంచినప్పటికి తన నియోజకవర్గం కాపులు మాత్రం తన వద్దనే ఉన్నారని వచ్చే ఎన్నికల్లో కూడా తనకే మద్దతు ఇస్తారని చెబుతున్నారు. తన నియోజకవర్గంలోని కాపులు మాత్రం పవన్‌ను నమ్మటం లేదన్నారు. మొదట్లో చాలా మంది పవన్ వెంట వెళ్ళాలని భావించినప్పటికి రాజకీయం, కామెంట్స్ చూసిన పునరాలోచనలో పడ్డారన్నారు. తన నియోజకవర్గంలోని కాపులంతా ఇప్పడు తనకే సపోర్టుగా ఉంటున్నారని అన్ని నియోజకవర్గాల్లోని కాపుల్లో కూడా మార్పు రావాలని ఆశిస్తున్నానని అన్నారు.


కాపులకు పవన్ అన్యాయం చేస్తున్నారు...
మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబా చేసిన శపథాన్ని నెరవేర్చడమే పవన్ ధ్యేయమని విమర్శించారు. జనసేన కార్యకర్తలు, కాపులను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెడుతున్నారని చెప్పారు. పవన్ జనసేనను ప్రారంభించింది ప్రజల కోసం కాదని, చంద్రబాబు కోసమేనన్నారు. చంద్రబాబు కంటే మోసగాడు, పవన్ కంటే కంటే ఆబద్ధాలకోరు, అమ్ముడు పోయేవారు దేశంలోనే ఎవరూ ఉండరని ఆయన మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిసొచ్చినా ప్రజల ఆశీస్సులు, ఆదరణ వైఎస్ జగన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని రాంబాబు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు పల్లకి మోయటానికి పవన్ ఆరాట పడుతున్నారని, అందుకు హోల్ సేల్‌గా కాపులను బలి చేయాలని చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాపు జాతికి అండగా ఉంటుందన్నారు.


మీకు అర్థం అవుతుందా... 
మీకు అర్థం అవుతుందా.. ఈ డైలాగ్ చాలా ఫేమస్. కాపులకు తాను ఎన్నిసార్లు చెప్పినా అర్దం కావటం లేదని అంబటి అన్నారు. పొత్తులపై తెలుగు దేశం, జనసేన, బీజేపి కలయికపై చేసిన కామెంట్స్ చేసిన అంబటి మీకు అర్థం అయ్యాయా అంటూ డైలాగ్‌లు విసిరారు. కాపులు పవన్ కోసం బట్టలు చించుకొని, పరుగులు పెడుతున్నారని, కనీసం తమ వాడు ముఖ్యమంత్రి అవుతాడంటూ తన వద్ద చాలా మంది మాట్లాడారని అన్నారు. వారికి పవన్ వ్యాఖ్యలు అర్థమయ్యాయని అనుకుంటున్నానని అంబటి తన మేనరిజంలో కౌంటర్ ఇచ్చారు.