ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో వాలంటీర్లకు జీతాలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఏపీ సీఎం జగన్‌ వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖున వృద్ధాప్య, వితంతు ఫించన్లను వాలంటీర్లు ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందిస్తున్నారు.


దానితో పాటు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమాన్ని అయినా సరే ఇంటి వద్దకే వచ్చి వివరించి చెబుతున్నారు వాలంటీర్లు. వారి సేవలను గుర్తించి వారికి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనాన్ని అందిస్తుంది. గతేడాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి వారికి 25 వేల జీతాన్ని ఫిక్స్‌ చేశారు.


అప్పటి నుంచి తమకి కూడా జీతాలు పెంచాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే వారికి జీతాలు పెంచే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇస్తున్న 5 వేలకు మరో 5 వేలు కలిపి మొత్తంగా 10 వేల జీతాన్ని వారికి అందించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.


అయితే పెరిగిన జీతాన్ని దసరా లేదా డిసెంబర్‌ 21 అంటే సీఎం జగన్‌ పుట్టిన రోజు నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. లేదా ఇంకా ముందుగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.30 లక్షల మంది వాలంటీర్లు లబ్దిపొందే అవకాశం ఉంది. అంతే కాకుండా వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా వారి సేవలు గుర్తించి వారికి సేవా అవార్డులతో పాటు నగదు బహుమతిని కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. 


వాలంటీర్ల జీతాలు పెంచడంతో పాటు త్వరలోనే వృద్ధాప్య ఫించన్లు కూడా పెరగనున్నట్లు తెలుస్తుంది. వచ్చే జనవరి నుంచి 3 వేల ఫించన్లు అందించనుండగా..దానికి మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 4 వేల రూపాయలు వృద్దులకు అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే జనవరి నుంచి 3 వేలు ఇచ్చి..2024 ఎన్నికల్లో కనుక గెలిస్తే 4 వేలు అందిస్తామని జగన్‌ ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.