Andhra Pradesh News: పాఠశాలలు తిరిగి ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో  విద్యార్థులకు అమలవుతోన్న పథకాలపై మాజీ ముఖ్యమంత్రి ఫొటో తీసేశారు. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. 


గతంలో ఏ ప్రభుత్వమూ చేయని ప్రచార ఆర్భాటం గత వైకాపా ప్రభుత్వం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  పిల్లలకిచ్చే చిక్కీపై సైతం జగన్ బొమ్మ వేయించుకోవడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలొచ్చాయి.  అలాగే ప్రతి పథకానికి ముందు జగనన్న.. వైఎస్ఆర్ పేర్లు చేర్చి అమలు చేయడం సైతం చూశాం. 


 కొత్త ప్రభుత్వం నేడు కొలువు దీరనున్న నేపథ్యంలో తొలి అడుగుల్లో ఒకటిగా జగన్ మార్కును తొలగించడంపై కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రెండు పథకాలపై జగన్ పేరును తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జగన్ బొమ్మలకు సైతం స్వస్తి పలకాలని సూచించారు. 


విద్యార్థులకు పాఠశాల కు సంబంధించిన సామాగ్రిని అందజేసే పథకం ‘జగనన్న విద్యార్థి కానుక’.  ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగు, పుస్తకాలు, బెల్టు, బూట్లు, సాక్సులు, యూనిఫాం ఇస్తారు. ఈ పథకం పేరును ‘స్టూడెంట్ కిట్’ గా మారుస్తూ కొత్తప్రభుత్వం నిర్ణయించింది. సర్వ శిక్షా అభియాన్ దీనిపై ఇప్పటికే మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. 


‘జగనన్న గోరుముద్ద’ పేరుతో గతంలో అమల్లో ఉన్న విద్యార్ధుల మద్యాహ్న భోజన పథకంలో సైతం కొత్త ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ పథకం పేరు నుంచి ‘జగనన్న’ అనే పదాన్ని తొలగించారు. ఇకపై ఈ పథకాన్ని ‘గోరుముద్ద’ అని పిలవనున్నారు.  ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో ఆదివారాన్ని తప్పించి ఆరు రోజులు గుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు వారానికి మూడు రోెజుల పాటు అందించే చిక్కీమీద ఉండే కవర్ పై గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండేది. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ఈ బొమ్మని సైతం తొలగించింది.  ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ రాజముద్రతో పిల్లలకు చిక్కీలు సరఫరా కానున్నాయి. 


ఈ ఏడాది విద్యార్థులకు అందే స్టూడెంట్ కిట్లకు సంబంధించి గత ప్రభుత్వ ఎన్నికల ముందే ఆర్డర్లిచ్చింది. ఇప్పటికే ఆయా మండలాలకు పుస్తకాలు, బూట్లు, బెల్టులు, యూనిఫామ్ తదితరాలు అందాయి. మండలాల స్టోర్ల నుంచి వాటిని పాఠశాలలకు తరలించాల్సి ఉంది. దీనికయ్యే వ్యయం సైతం ఎంఈవోల ఖాతాల్లో జమయ్యాయి. దీనిలో ఏవైనా ఇబ్బందులుంటే తమకు మెయిల్ ద్వారా తెలియజేయాలని సర్వ శిక్షా అభియాన్ మండల విద్యాశాఖాధికారులను ఆదేశిచింది. ఈ ఏడాది 36.69 లక్షల మంది విద్యార్థులకు ఈ స్టూడెంట్ కిట్లు అందనున్నాయి. 


గత ప్రభుత్వం ప్రభుత్వ పథకాల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా స్థలాలు, ఇళ్ల పట్టాలపై సైతం జగన్ బొమ్మని ముద్రించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి ప్రభుత్వ సంబంధిత కార్యక్రమం, పథకం, యూనివర్సిటీల పేర్ల  ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్, లేదా ఆయన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పేర్లు పెట్టి కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది.