ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానిపై రాష్ట్ర ప్రజలపై సందేహాలు తొలగిపోలేదు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా సాలభ్యం కోసం మూడు రాజధానులను ప్రకటించింది. దాంతో రాష్ట్రంలో అమరావతే తమ రాజధాని అని సీఆర్‌డీఏ ప్రాంతాల రైతులు, స్థానికులు ఆందోళన మొదలుపెట్టారు. తాజాగా ఇదే విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల్లో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని, స్పష్టత కోరారు జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి అని జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీకి రాజధాని అమరావతేనని తమ వద్ద ఉన్న సమాచారం అదేనని కేంద్రం స్పష్టత ఇచ్చింది.


రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే.. 
తమకు మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖ, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని తర్వాత చెప్పినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ గుర్తుచేశారు. అయితే తమ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు బదులిచ్చారు.


మూడు రాజధానుల బిల్లు అలా వెనక్కి..
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలును నిర్ణయించారు. దీనిపై రాజధాని అమరావతి రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వారి నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 


మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ చివరి వారంలో హైకోర్టుకు తెలిపింది. దీనిపై అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుంటున్నామని, త్వరలోనే దీనిపై మరో నిర్ణయంతో వస్తామని ఏపీ సర్కార్ అసెంబ్లీలో ప్రకటించింది. కొత్త బిల్లులో మార్పులు చేసి రాజధానిని ప్రకటిస్తామని ఏపీ కేబినెట్ స్పష్టం చేయడం తెలిసిందే. 


రాజధాని ఎక్కడో చెప్పండి: ఆర్బీఐ
ఏపీ రాజధాని ఎక్కడో తమకు ఫైనలైజ్ చేసి చెబితే తమ సంస్థ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది. ఏపీలో ఆర్‌బీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని తమకు అందిన లేఖపై ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ సుభాశ్రీ స్పందించారు. ఏపీలో రాజధాని ఎక్కడ నిర్ణయిస్తున్నారో చెబితే తమ కార్యాలయం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Also Read: AP PRC Issue: పీఆర్సీపై చర్చలు విఫలమైనట్లే... సమ్మె సైరన్ మోగిస్తాం... ఉద్యోగ సంఘాలు స్పష్టం 


Also Read: Srikakulam: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు