Allu Arjun Moves AP High Court:  ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించిన అల్లు అర్జున్ పై ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని తన స్నేహితుడ్ని కలవడానికి మాత్రమే వెళ్లానని ఆయన అంటున్నారు.  అల్లు అర్జున్‌ దాఖలు చేసిన  పిటీషన్‌ను కోర్టు స్వీకరించింది.  అక్టోబర్‌ 22న విచారణ జరిగే అవకాశం ఉంది. 


ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చిన సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదు కానీ ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులుతరలి వచ్చారు.  నంద్యాల నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలని.. ఆయనకు మద్దతుగానే వచ్చానని మీడియాకు చెప్పారు.  భారీ సంఖ్యలో జనం రావడంతో ఎన్నికల సంఘం దాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగానే పరిగణించింది.                              


దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్


అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని స్థానిక ఆర్వో పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి, అల్లు అర్జున్ పై ఎన్నికల నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఓ వైపు మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్తూంటే.. అల్లు అర్జున్ మాత్రం భిన్నంగా  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లడం కూడా వివాదాస్పదమయింది. అయితే తన స్నేహితుల కోసం తాను ఎక్కడికైనా వెళ్తానని ఆయన ప్రకటించారు. ఈ కారణంగా మెగా కుటుంబంలో విబేధాలు కూడా వచ్చాయన్న ప్రచారం జరిగింది.                   


 Tirumala News: బ్లాక్‌లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు


ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసు కావడంతో కోర్టులో ఊరట దక్కే అవకాశాలు తక్కువేనని ఎన్నికల కేసుల నిపుణులు అంచనా వేస్తున్నారు. పోలీసులు అన్నీ పరిశీలించి కేసు నమోదు చేసి ఉంటారు కాబట్టి విచారణ ఎదుర్కోవాలని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. పోలీసులు వేసే కౌంటర్ ను బట్టి ఈ పిటిషన్ మెరిట్స్ ఉంటాయని అనుకోవచ్చు.  అల్లు అర్జున్ ప్రచారం చేసినప్పటికీ నంద్యాల వైసీపి అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఘోరపరాజయం పాలయ్యారు.  వ్యక్తిగతంగా రాజకీయాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ స్నేహితుల్లో రాజకీయ నేతలు ఎక్కువగా ఉంటారు.తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కు మంచి స్నేహితులు.