Jagananna Chedodu :  దిల్లీ టూర్ కు ముందు ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయ్యింది. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.


చేదోడు పథకం 


రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ. 330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో  బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.  జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 30,000 ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్ల కాలంలో  ఈ పథకం ద్వారా  ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 927.51 కోట్లు.  


అవినీతి లేకుండా 


లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్‌ప్లే చేసి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక, ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటే మిస్‌ కాకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్‌లలో కూడా అర్హులయిన వారికి లబ్ధిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.


ఎంతమందికంటే 


షాపులున్న 1,67,951 మంది టైలర్లకు రూ. 167.95 కోట్లు, షాపులున్న 1,14,661 మంది రజకులకు రూ. 114.67 కోట్లు, షాపులున్న 47,533 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 47.53 కోట్లు పంపిణీ చేస్తున్నారు.


ఇవి లెక్కలు 


జగనన్న చేదోడు పథకం క్రింద ఇప్పటివరకు అందించిన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్లలో కేవలం ఈ పథకం ద్వారా  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 927.39 కోట్లుగా వెల్లడించారు. జగనన్న చేదోడు పథకం కింద ఇప్పటి వరకు అందించిన లబ్ధి వివరాల్లోకి వెళితే 2020 – 21లో లబ్ధిదారుల సంఖ్య  2,98,122 కాగా, అందించిన ఆర్థిక సహాయం, రూ. 298.12 కోట్లు. 2021 – 22లో లబ్ధిదారుల సంఖ్య 2,99,116 కు పెరిగింది. ఇక అందించిన ఆర్థిక సహాయం రూ. 299.12 కోట్లు.  2022 – 23లో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 కాగా, పంపిణీ చేస్తున్న ఆర్థిక సాయం రూ. 330.15 కోట్లు కాగా మెత్తంగా రూ. 927.39 కోట్లు అన్న మాట. 


రేపు పల్నాడు జిల్లాలో టూర్ 


జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో రుణాలు మంజూరు చేసేందుకు పల్నాడు జిల్లా వేదిక అయ్యింది. సోమవారం సీఎం  వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా వినుకొండ పర్యటిస్తారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 – 12.20 వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.