భారత చెస్ ఆటగాడు రమేష్‌బాబు ప్రజ్ఞానానంద మరోసారి ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌కు కొరకరాని కొయ్యలా మారాడు. ప్రజ్ఞానానంద, కార్ల్‌సెన్ 85వ టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ 2023 ఫైనల్ రౌండ్ 12లో కలుసుకున్నారు. అతని కెరీర్‌లో బెస్ట్ సేవ్. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్‌తో జరిగిన తన రెండో క్లాసికల్ ఎన్‌కౌంటర్‌లో ప్రజ్ఞానానంద కార్ల్‌సన్‌తో ఆడిన 'క్లాసికల్ గేమ్'లో డ్రా చేసుకున్నాడు.


'నేను నిజంగా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాను. నేను కలిగి ఉన్న స్థానానికి చాలా ఎక్కువ సాధించాలని నేను భావిస్తున్నాను. కానీ అతను బాగా డిఫెండ్ చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే ఇది కాస్త బ్యాక్‌బ్రేకర్ అని నేను భావిస్తున్నాను. టోర్నమెంట్ విజయం సాధించే అవకాశం పోయింది. రేపు ఏం జరుగుతుందో తెలీదు. కానీ ప్రస్తుతానికి ఇది నిరాశపరిచింది.’ అని మ్యాచ్ తర్వాత కార్ల్‌సన్‌ చెప్పాడు.


అంతకుముందు ప్రజ్ఞానానంద గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఆన్‌లైన్ చెస్ పోటీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానానంద ఓడించాడు. 2013లో కార్ల్‌సన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాక, చెస్ కాంపిటీషన్‌లో కార్ల్‌సన్‌ ఓడించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ప్రజ్ఞానానంద నిలిచాడు.


ఆ తర్వాత మేలో జరిగిన మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ చెసబుల్ మాస్టర్స్ 2022 ఆన్‌లైన్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానానంద కార్ల్‌సన్‌ను ఓడించాడు. టోర్నీ ఐదో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానానంద విజయం సాధించాడు. ఆగస్ట్‌లో జరిగిన ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ చివరి రౌండ్‌లో కార్ల్‌సన్‌పై విజయం సాధించేందుకు ప్రజ్ఞానానంద అద్భుతమైన ప్రదర్శనను అందించాడు. 2022లో ఈ నార్వే ప్లేయర్‌పై ప్రజ్ఞానానందకు ఇది మూడో విజయం.


తమిళనాడుకు చెందిన చెస్ ఆటగాడు అయిన ప్రజ్ఞానానంద 2018లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సంపాదించాడు. గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన రెండో అతి పిన్న వయస్కుడైన వ్యక్తిగా వ్యక్తిగా నిలిచాడు. అంతకు ముందు అతను 2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ అండర్-8 టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇది అతనికి కేవలం ఏడు సంవత్సరాల వయస్సులోనే FIDE మాస్టర్ టైటిల్‌ను సంపాదించిపెట్టింది.


ప్రజ్ఞానంద గతంలోనే ప్రతిష్ఠాత్మక రెక్‌జవిక్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీని కూడా గెలుచుకున్నాడు. తొమ్మిది రౌండ్లు ఆడి 7.5 పాయింట్లతో అగ్రగామిగా నిలిచాడు. 16 ఏళ్ల ఈ కుర్రాడు తన సహచరుడైన మరో గ్రాండ్‌మాస్టర్‌ డీ గుకేశ్‌ను ఆఖరి రౌండ్లో ఓడించి విజేతగా ఆవిర్భవించాడు.


ఆఖరి రౌండ్లో గుకేశ్‌ ఓ ఎత్తులో పొరపాటు చేయడంతో ప్రజ్ఞానందకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. సునాయాసంగా విజయం అందుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన తొమ్మిది రౌండ్లలోనూ ప్రజ్ఞానంద అజేయంగా నిలవడం ప్రత్యేకం. ఆఖరి రెండు రౌండ్లలో అతడు గుకేశ్‌, మతియు కార్నెట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. అంతకు ముందూ నాలుగు విజయాలు సాధించాడు. అమెరికన్‌ ఆటగాడు అభిమన్యు మిశ్రాను ఓడించాడు.


ఈ విజయం ద్వారా ప్రజ్ఞానందకు మరో 13.2 ఎలో రేటింగ్‌ పాయింట్లు వచ్చాయి. ఇక 6 పాయింట్లతో వెనకబడ్డ గుకేశ్‌ 17వ స్థానంలో నిలిచాడు. గ్రాండ్‌మాస్టర్ అభిజీత్‌ గుప్తా 6.5 పాయింట్లతో ఎనిమిదో స్థానం అందుకున్నాడు.