AP Minister Chelluboyina Venugopalakrishna: అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సమాచార పౌరసంబంధాలు, బిసి సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెప్పారు.
రైతులను ఆదుకుంటాం....
రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకు మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాల కృష్ణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారని వారం రోజుల్లోగా పంట నష్టం అంచనా వేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. అధికారులు అందించిన ప్రాథమిక అంచనా ప్రకారం 5 జిల్లాల్లోని 25 మండలాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని మంత్రి వివరించారు. నంద్యాల జిల్లాలోని 15 మండలాల్లో మొక్కజొన్న, వరి, మినుము, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాల పరిధిలో మొక్కజొన్న, కర్నూలు జిల్లాలో 1 మండలంలో మొక్కజొన్న, పార్వతీపురం మన్యం జిల్లాలోని 3 మండలాల్లో మొక్కజొన్న, అరటి, ప్రకాశం జిల్లాలో ఒక మండలంలో మినుము, పత్తి పంట దెబ్బతిందని మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో కరువు...
గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు అనేక ఇబ్బందులు పడేవారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పుష్కలంగా వర్షాలు పడి జలాశయాలు అన్ని పూర్తిగా నిండి రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి అన్నారు. రైతులు అన్ని విధాలా ఆనందంగా ఉండి రేపో మాపో పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఆకాల వర్షాలతో రైతులకు కొంత ఇబ్బంది కలిగిందని చెప్పారు. పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పునరుద్ఘాటించారు. ఏ సీజన్ లో పంటలు దెబ్బతింటే ఆ సీజన్లోనే ఇన్ పుట్ సబ్సిడీ అందించి రైతులను ఆదుకునే విధానానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి రైతులను ఆదుకుంటున్నట్టు మంత్రి వివరించారు.


పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ...
అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని అందించడంతో పాటు పంటల బీమా కూడా కల్పిస్తామన్నారు. పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పంటల బీమాను కల్పిస్తామని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. రైతులు విత్తనం మొదలు పంటలు పండించి వాటిని అమ్ముకునే వరకు వారికి తగిన తోడ్పాటును అందించేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు.


నూజివీడులో పంటలకు నష్టం...
అకాల వర్షం కారణంగా నూజివవీడులో పంటలకు అపార నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూశారు. నూజివీడు నియోజకవర్గంలో పలుచోట్ల ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడం పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాణిజ్య పంటల కూడా పూర్తిగా దెబ్బతినడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తుపాన్ ప్రభావంతో నియోజక వర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఉన్న మొక్కజొన్నలు, పందిర్లపై ఉన్న పొగాకు తడిసిపోవడంతో తీవ్ర నష్టంపోయామని  రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురుగాలితో కూడిన వర్షం పడడంతో మామిడికాయలు నేలరాలాయి. పింద కట్టు మీద ఉన్న మామిడి తోటలకు మాత్రం ఈ వర్షం కొంతమేర లాభించిందని రైతులు చెబుతున్నారు.