Car Goes Under Plane: దేశంలోని విమాన యాన సంస్థలు రోజుకో సమస్యతో వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా దిల్లీ విమానాశ్రయంలో ఇండిగో సంస్థకు చెందిన విమానం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. గోఫస్ట్ ఎయిర్ లైన్ కు చెందిన ఓ కారు... ఇండిగో ఏ320నియో విమానం కిందకు వెళ్లింది. విమానం ముందు భాగంలోని చక్రాల ముందు ఆగింది. త్రుటిలో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ ఎయిర్ పోర్ట్ టీ2 టెర్మినల్ లోని 201వ స్టాండ్ లో ఈ ఘటన జరిగింది. దీనిపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది. 



త్రుటిలో తప్పిన ప్రమాదం.. అదృష్టవశాత్తు అంతా సేఫ్!


విమానం మంగళ వారం ఉదయం దిల్లీ నుంచి పట్నాకు బయలు దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్విఫ్ట్ డిజైర్ కారు దూసుకొచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయ పడలేదని అధికారులు వివరించారు. విమానానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఘటన అనంతరం విమానం యథాతథంగా ప్రయాణం సాగించిందని, షెడ్యూల్ ప్రకారమే బయల్దేరనుందని వెల్లడించారు. కాగా... ఈ ఘటనపై డీజీసీఏ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. 


టేకాఫ్ అవుతుండగా.. బురదలో ఇరుక్కుపోయిన టైర్లు!


మొన్నీమధ్యే ఇండిగో విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. అసోం జోర్హాట్ విమానాశ్రయం నుంచి కోల్ కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా... రన్ వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను క్షేమంగా కిందకు దించేశారు. అయితే ఆ తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో మొత్తం 98 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని మరో విమానంలో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 


50 శాతం విమానాలను మాత్రమే నడపాలి..!


కొంత కాలంగా పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పైస్ జెట్, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయట పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. బి1/బి2 లైసెన్స్  ఉన్న నిపుణులైన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో విమానాలను విడుదల చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. 8 వారాల పాటు స్పైస్ జెట్ విమానాలను 50 శాతం మాత్రమే నడపాలని ఆంక్షలు విధించింది.