ఏపీ సీఎం జగన్ తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు విబేధాలు సద్దుమణిగాయా? వారిద్దరూ మాట్లాడుకుంటున్నారా? అన్నాచెల్లెలు మధ్య వివాదాల కారణంగానే  తెలంగాణలో పార్టీ పెట్టిందన్న మాటలు పుకార్లేనా?  


వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించిన తర్వాత.. తొలిసారి మీడియా ముందు మాట్లాడారు షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని తెలిపారు. ఏపీ సీఎం జగన్​ మీద అలిగితే.. మాట్లాడ్డం మానేస్తాను కానీ పార్టీ పెట్టనని చెప్పారు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందన్న ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ధ్యేయంగా పార్టీ పెట్టినట్లు తెలిపారు. అంటే తన అన్న జగన్ పాలన బాగుందని షర్మిల చెప్పకనే చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.


 'సీఎం జగన్ మీద అలిగితే మాట్లాడం మానేస్తా.. పార్టీ పెట్టను. పార్టీ అంటే వ్యక్తి కాదు.. ప్రజలు, వ్యవస్థ. నేను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. నేను ఒంటరినని భయపడను, బాధలేదు. ఇది ప్రజల పార్టీ. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవు.. ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు పార్టీ పెట్టాను. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది. నేను ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి.  రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు. కేసీఆర్ ఒక నియంత.. ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు.' అని వైఎస్ షర్మిల మాట్లాడారు.


ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని వ్యాఖ్యానించారు. తెరాసలో మహిళలకు గౌరవం ఉండదని విమర్శించారు. మహిళలంటే వ్రతాలే చేసుకోవాలని కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాను వ్రతమే చేస్తున్నానని అన్నారు.


వైఎస్ లాగే తానూ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల చెప్పారు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని.. సీఎం అయ్యాక కేసీఆర్‌లోని దొర బయటికొచ్చారని విమర్శించారు.


సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని షర్మిల అన్నారు. తెలంగాణ అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది వైఎస్సేనని చెప్పారు. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని పేర్కొన్నారు.


పగ, ప్రతీకారం కోసమే హుజూరాబాద్ ఉపఎన్నిక అని షర్మిల అన్నారు. కేసీఆర్ పాలనలో జనం ఇబ్బందులు చూడలేకే పార్టీ పెట్టానని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ విఫలమయ్యారని అన్నారు. ఆయన తనకొచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు అర్థమే లేదన్న షర్మిల.. పగలు, ప్రతీకారాల కోసం హుజూరాబాద్ ఉపఎన్నికను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అని ప్రశ్నించారు.