టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ‘మహిళా బంధు’ మూడు రోజుల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న తాము మార్చి 6 నుంచి 8 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 


మహిళల సాధికారత కొరకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మిషన్ భగీరథ వంటి పథకాలను వారికి వివరిస్తూ నేడు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేడు, రేపు నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులు, ఆశవర్కర్లు, వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బందిని టీఆర్ఎస్ శ్రేణులు సన్మానిస్తున్నాయి. జై కేసీఆర్‌, మహిళా బంధు కేసీఆర్ అనే నినాదాలు మార్మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోనూ మహిళా బంధు కేసీఆర్ అంటూ ఆయన చిత్రపటానికి మహిళలు రాఖీలు కడుతున్నారు.






మహిళాభ్యున్నతికి టీఆరెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పి శేఖర్ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని భువనగిరిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళా సోదరీమణులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మహిళలకు మర్యాదపూర్వక సన్మానం చేశారు. 






ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ మేరకు 'మహిళా బంధు కేసీఆర్' ఉత్సవాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సంబరాలలో పాల్గొని మహిళల కోసం తెచ్చిన పథకాలను వివరించారు.






మహిళ బంధు ఉత్సవాల సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు.