నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూన్ 8) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య మరియు పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. 


తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు  అక్కడక్కడ మరియు ఎల్లుండి  కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులుతో (గాలి  గంటకు 30 నుండి 40 కి మీ వేగం)  కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.


ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 62 శాతంగా నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
‘‘నేడు తేమగాలులు బాగా ఉండటం వలన మధ్యాహ్నం వరకు ఉపసమనం లభించే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ భాగాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది. అలాగే విశాఖ నగరం పరిసరాల్లో కొన్ని తేలికపాటి వర్షాలు, చల్లటి గాలులు విస్తరిస్తున్నాయి. దీని వలన వైజాగ్ లో నేడు మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతం అయ్యి ఉండనుంది. మరోవైపు నగరంలోని పలు భాగాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు, అనంతపురం, నంధ్యాల జిల్లాల్లో చల్లటి వాతావరణం, మేఘావృతమైన ఆకాశం ఉంది. ఇది అలాగే మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం కొనసాగుతోంది.


నేడు చిత్తూరు, అన్నమయ్య​, తిరుపతి, కడప​, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సాయంకాలం, రాత్రి సమయాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలం. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడ అక్కడక్కడ వర్షాలను చూడగలం. అది కూడ చాలా తక్కువ చోట్లల్లో కురుస్తాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


బిపర్‌జోయ్ తుపాను స్థితి ఇదీ..
భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం.. తూర్పు - మధ్య అరేబియా సముద్రం మీదుగా చాలా తీవ్రమైన తుపాను బిపర్‌జోయ్ ప్రస్తుతం పోరుబందర్‌కు నైరుతి దిశలో 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. తుపాను కారణంగా, జూన్ 10, 11, 12 తేదీల్లో గాలుల వేగం 45 నుంచి 55 నాట్ల వరకు వెళ్లవచ్చు. వేగం కూడా 65 నాట్ల మార్కును తాకవచ్చు. ఈ తుపాను దక్షిణాదితో సహా కోస్తా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన గాలిని తెస్తుంది. గుజరాత్, సౌరాష్ట్ర అన్ని ఓడరేవులను సుదూర హెచ్చరిక సిగ్నల్‌ను ఎగరవేయమని ఐఎండీ నిర్దేశించింది.