ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఈశాన్య, తూర్పు దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 56 శాతంగా నమోదైంది.


మెున్నటి వరకు తెలంగాణలో విపరీతమైన ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టగా.. తాజాగా చలికాలం ప్రారంభమైంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 


అక్టోబరు 27 నుంచి 31 తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నమోదు కాబోయే అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 29 నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు అంచనా వేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


‘‘ఈశాన్య రుతుపవనాల మొదటి తాకిడి చాలా బలహీనంగా ఉంది. దీని వలన అక్కడక్కడ మాత్రమే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలనే కొనసీమ​, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలను మరో గంట - రెండు గంటల సమయంలో చూడగలము. కానీ ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.