దక్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.


కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 2 - 4 డిగ్రీలు: ఐఎండీ
తెలంగాణలో చలి నేడు రేపు 2 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నేడు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఇక మహబూబ్ నగర్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కడ 37 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 10.2 డిగ్రీలు నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేశారు.


‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ​, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.