నిన్నటి ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు మరొక ఆవర్తనము ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద, సగటు సముద్రమట్టం నుండి 3.1 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిందని తెలిపారు. 


ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, ఎల్లుండి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రలో మూడు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉంది. 


‘‘నేడు ఉత్తరాంధ్రలో సాయంకాలం, రాత్రి వర్షాలుంటాయి. ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ వర్షాలను చూడగలం. కానీ నేడు విశాఖ ముఖ్య నగర ప్రాంతాల్లో అంతగా వర్షాలు ఉండవు. ఉంటే కొద్ది సేపు భారీ వర్షాలు లేదా తేలికపాటి చినుకులు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నం వైపు ఎక్కువ వర్షాలు ఉంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


కాబట్టి, ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పని చేసే కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.