వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. అయితే, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర చేసుకునేందుకు  ఆమెకు వరంగల్‌ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే షరతులతో కూడిన అనుమతిని షర్మిల యాత్రకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరం నవంబర్‌ 28వ తేదీన వరంగల్‌ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.


షరతులు ఇవే..
రోజు మొత్తం కాకుండా ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పద వాఖ్యలు చేయవద్దని పోలీసులు చెప్పారు. ర్యాలీల సందర్భంగా బాణా సంచా లాంటివి ఎవరూ కాల్చవద్దని అన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు అని చెప్పారు.


రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను పిబ్రవరి 2 నుంచే కొనసాగించాలని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు నిర్ణయించారు. పాదయాత్ర ఆగిన చోట అంటే నర్సంపేట నియోజక వర్గం శంకరమ్మ తాండా నుంచే పాదయాత్ర మొదలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజక వర్గాలలో పాదయాత్ర పూర్తి అవ్వగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 8 నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ ఘనపూర్, జనగామ, పాలకుర్తి, మహబూబాబాద్ మీదుగా పాలేరు నియోజక వర్గంలో మరోసారి అడుగు పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది. 


ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3,512 కి.మీ పూర్తి కాగా.. 4 వేల కి.మీ పూర్తి చేసేందుకు 25 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ముగింపు సభ పాలేరు నియోజక వర్గంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎవరి పాదయాత్రకు లేని షరతులు తమ పాదయాత్రకు పెట్టడంపై వైఎస్ షర్మిల గారు ముఖ్యమంత్రి కేసీఅర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా పాదయాత్ర కేసీఅర్ పాలనకు అంతిమయాత్ర. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కేసీఅర్ కి భయం పట్టుకుంది.పాలన పై ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే కేసీఅర్ కు చమటలు పడుతున్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు.అందుకే 15 కండీషన్లు పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే మా కర్తవ్యం’’ అని వైఎస్ షర్మిల గారు అన్నారు.