ఆ జిల్లాలో బంజారా నేతలదే ఆధిపత్యం.. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్నది కూడా వారే. ఒకే జాతి నుండి నాయకులుగా ఎదిగి, ఒకే పార్టీలో కొనసాగుతున్నా ఒకేదారిలో నడవడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఇప్పుడు కాదు మొదటి నుంచి ఆ నేతల మధ్య రాజకీయ హిట్ కాక రేపుతోంది.


ఓ వైపు విప్లవం.. మరో వైపు ఉద్యమ ఖిల్లాగా పేరు
విప్లవాల ఖిల్లా.. ఉద్యమాల్లో పిడికిలెత్తిన జిల్లా మానుకోట. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సాక్షిగా ఎంతటి పోరాటం జరిగిందో అందరికీ తెలిసిందే. అంతటి చైతన్యాన్ని అందించిన మానుకోటలో బీఆర్ఎస్ పార్టీకి గ్రూపుల కారణంగా బీటలు వారుతున్నాయి. ఒకే గిరిజన జాతికి చెందిన బిడ్డల పంచాయితీ రచ్చకెక్కుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వారి మధ్య నెలకొన్న విభేదాలు అందరి దృష్టిని అటుగా చూపించే పరిస్థితికి చేర్చాయి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చట్ట సభలో అడుగు పెట్టాలన్న లక్ష్యం ఒకరిద్దరిదైతే, తమ బెర్త్ ఖాయం చేసుకోవాలన్న తపన మరికొందరిది. వారసులకు ఎంట్రీ ఇవ్వాలని మరోనేత ప్రయత్నాలు.. ఇలా ఎవరి లక్ష్యాలను వారు నిర్దేశించుకుని గ్రూపులుగా విడిపోయి ముందుకు సాగుతున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది.


ఎంపీ, ఎమ్యెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా రాజకీయాలు వేడెక్కుతున్నాయా?
మహబూబాబాద్ జిల్లాలో నెలకొన్న వార్ బహిరంగంగానే సాగుతోంది. జిల్లా కేంద్రం సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదని ఇటీవల కాలంలో జరిగిన బహిరంగ సభల్లో వీరిద్దరూ వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది. అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరి క్యాంపు ఆఫీసులకు వారు పరిమితం అవుతున్నారు. సొంత ప్రభుత్వానికి సంబంధించిన సంబరాలే అయినా ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించడమే అయినా వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానుకోట జిల్లా అద్యక్షురాలిగా స్థానిక ఎంపీ మాలోతు కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో విబేధాలు ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపున డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తన తనయుడు రవిచంద్రకు టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. 


అయితే అదే సీటుపై మరో ఇద్దరు మహిళా నాయకుల దృష్టి పడినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపున శంకర్ నాయక్ కు మంత్రి సత్యవతి రాథోడ్ ఆశీస్సులు అందిస్తున్నారని ప్రత్యర్థి వర్గం కినుక వహిస్తోంది. అలాగే ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్ టికెట్ ఆశిస్తున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మానుకోటలో ఓ వేదికపై మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ప్రసంగిస్తున్న క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో కూడా తనకే ప్రాధాన్యత ఇచ్చారని, సిట్టింగ్ లకే అవకాశం ఇస్తామని సీఎం ప్రకటించారని శంకర్ నాయక్ వర్గం బలమైన వాదనలు వినిపిస్తోంది.


మహబూబాబాద్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఎంపీ
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకే అంటూ తన కేడర్ ను సైతం ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సీఎం పర్యటన నేపథ్యంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ తో పాటు జిల్లా పార్టీ కార్యాలయం విషయంలో మంత్రి దయాకర్ రావు ముందే ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో వాగ్వాదానికి దిగారు. తన బర్త్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ లో తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఎంపీ దూకుడుకు సైలెంట్ గానే చెక్ పెట్టే దిశగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ పావులు కలుపుతున్నాడు. తన అసెంబ్లీ పరిధిలోని కీలక నాయకులను వ్యక్తిగతంగా కలుస్తూ చేయి జారిపోకుండా చూసుకుంటున్నాడు. 


మహబూబాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా శంకర్ నాయక్ ను అభినందించడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ శంకర్ నాయక్ కు కన్ఫర్మ్ అయినట్లు ఆయన అనుచరులు ఉత్సాహంతో ఉన్నారు. ఆ ఉత్సాహంతోనే ఖమ్మం బహిరంగ సభకు భారీగా బీఅర్ఎస్ శ్రేణులను శంకర్ నాయక్ తరలించారు. ఇక డోర్నకల్ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో తన వారసున్ని నిలపాలనుకున్న రెడ్యానాయక్, తన అనుచరుల నుండి వ్యతిరేకత రావడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ సమావేశంలో ఎంపీ కవిత, రెడ్యానాయక్ కుమారుడు రవిచంద్ర ఈ విషయాన్ని పార్టీ శ్రేణుల ముందే చెప్పినట్లుగా సమాచారం. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సైతం డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


నాయకుల మధ్య కోల్డ్ వార్
బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య వార్ తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో నాయకత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఆవశ్యకత అయితే ఉందని జిల్లా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో పార్టీ ఉనికే లేకుండా పోగా బీజేపీ పరిస్థితి అంతంతగానే ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో ఏది ఏమైనా ప్రతి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకు ఉన్నదన్న విషయం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఏర్పడిన వర్గ విబేధాలను గమనించి ఇక్కడి క్యాడర్ ప్రత్యామ్నాయ పార్టీ వైపు మొగ్గు చూపితే బీఆర్ఎస్ పార్టీకి మొదటికే మోసం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. లీడర్ల మధ్య సయోధ్య లేనట్టయితే క్యాడర్ కూడా అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నది నిజం. లీడర్లలో నెలకొన్న పంచాయితీలకు చెక్ పెట్టేందుకు అధినేత కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.