‘‘భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్‌ చేయండి. లేదంటే నీపై పెట్రోల్‌ పోసి చంపుతాం’’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం (మార్చి 20) జరిగింది. బాధిత తహసీల్దార్‌ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండలంలోని బిల్‌ నాయక్‌ తండాకు గుగులోతు పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని స్లాట్‌ బుక్‌ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్‌ నుంచి నోడ్యూస్‌ సర్ఠిఫికెట్‌ తీసుకురావాలని తహసీల్దారు కార్యాలయ సిబ్బంది సూచించారు.


ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్‌ నాయక్‌ తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం రిజిస్ట్రేషన్‌ చేయండి. నోడ్యూస్‌ ఎందుకు తీసుకురావాలి’ అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, రిజిస్ట్రేషన్‌ చేయకపోతే నీపై పెట్రోల్‌ పోసి చంపేస్తామని వారి ముందే తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారని తహసీల్దార్ ఆరోపించారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.