Junior lecturer recruitment: జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్ 2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పేపర్ 2 ఆంగ్లంలోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పేపర్ 2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులో ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ  ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హెచ్చరించింది. నియామక నిబంధనలు లేకుండా ఇష్టానుసారం పరీక్ష విధానాన్ని మార్చే అధికారం కమిషన్‌కు లేదని పేర్కొంది. 


జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌లో పేపర్‌-2 ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్లో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన టి.విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మార్చి 20న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రభుత్వ కళాశాలలున్నాయని, మాధ్యమపరంగా ఖాళీలను వెల్లడించలేదని అన్నారు. 2004, 2008లో నోటిఫికేషన్‌లలో పేపర్-2 ఐచ్ఛిక సబ్జెక్ట్‌కు రెండు భాషల్లోనూ ప్రశ్నపత్రం ఇచ్చారన్నారు.


కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ జూనియర్ లెక్చరర్ పోస్టులకు పీజీని విద్యార్హతగా నిర్ణయించామని, తెలంగాణలో పీజీ కోర్సు ఇంగ్లిష్లోనే కొనసాగుతోందన్నారు. 16 ఐచ్ఛిక సబ్జెక్టులున్నాయని, వీటన్నింటికీ తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రశ్నపత్రాలు ఇవ్వాలంటే కష్టసాధ్యమైన పని అన్నారు.


ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి యూనివర్సిటీల ప్రాస్పెక్టస్ పరిశీలించాక ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు దూరవిద్య కేంద్రాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనమిక్స్, హిస్టరీ సబ్జెక్టులను తెలుగు, ఇంగ్లిష్లోను, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సోషియల్ సైన్సెస్, ఎం.ఎ.ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలు తెలుగులో మాత్రమే బోధిస్తున్నట్లు వెల్లడైందన్నారు. అందువల్ల రాష్ట్రంలో పీజీ కోర్సు ఇంగ్లిష్‌లోనే కొనసాగుతోందన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదన సరికాదన్నారు.


పరీక్షల నిర్వహణకు సంబంధించి నిబంధనల ప్రస్తావన లేదని, అంతేకాకుండా గత నోటిఫికేషన్లలో రెండు భాషల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశంపై ఎలాంటి సమాధానం లేదన్నారు. అలహాబాద్ హైకోర్టులో నియామకాలపై.., ఏపీ హైకోర్టు తెలుగుభాష ప్రాధాన్యంపై ఇచ్చిన కీలకమైన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అధికార భాషల చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం తెలుగు, ఉర్దూను వినియోగిస్తారు. శాసనసభల్లో అధికారిక ప్రయోజనాల కోసం సెక్షన్-4 ప్రకారం ఇంగ్లిష్‌ను వినియోగిస్తారన్నారు. దీనిప్రకారం తెలుగును అధికార భాషగా వినియోగిస్తున్నారని, ఇంగ్లిష్‌ను అధికారిక ప్రయోజనాల నిమిత్తం ఉపయోగిస్తున్నారని చెప్పారు.


నోటిఫికేషన్‌లో నిబంధనలు లేకుండా ఇంగ్లిష్ మాత్రమే ఇచ్చే అధికారం కమిషన్‌కు లేదన్నారు. 450 మార్కులకు నిర్వహించే ప్రశ్నపత్రంలో పేపర్‌-2లో 150 ప్రశ్నలకు 300 మార్కులుంటాయని, అంటే అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా పీజీస్థాయిలోని రెండో పేపరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల పేపర్-2 ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశిస్తూ జస్టిస్ శరత్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.



తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్ లేదా జులైలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల్లో అత్యధికంగా మ్యాథ్స్-154, ఇంగ్లిష్-153, జువాలజీ-128, హిందీ-117; బోటనీ,కెమిస్ట్రీ-113 పోస్టులు, ఫిజక్స్-112 పోస్టులు ఉన్నాయి. 


కాగా.. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల్లో ఉర్దూ, మరాఠీ మీడియం పోస్టులకు పదో తరగతి వరకు ఆయా మీడియంలలో చదువుకున్నవారు లేదా పదోతరగతిలో ఆయా భాషలు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఉన్నా.. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఉన్న వారు ఈ మీడియంలోని పోస్టులకు అర్హులని విద్యాశాఖ వెల్లడించింది. జేఎల్‌ సివిక్స్‌ పోస్టులకు పొలిటికల్‌ సైన్స్‌ లేదా పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ సబ్జెక్టుల్లో పీజీ చేసి 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొంది.



పరీక్షవిధానం: 


మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.



నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Website 



Also Read:


కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...