Errabelli Dayakar Rao News: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మార్పు ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా దయాకర్ రావు పార్టీ మారకపోవడంతో పాటు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. దయాకర్ రావు మనస్సు మార్చుకున్నారా... లేదా బీఅర్ఎస్ లోనే  కొనసాగాలనుకున్నారో తెలియదు కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 


యాక్టివ్ అయిన ఎర్రబెల్లి


ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా, బీ ఆర్ ఎస్ లో కీలక నేతగా కొనసాగుతున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో బీ అర్ ఎస్ కు కొద్దిరోజులుగా దూరంగా ఉంటూ వచ్చారు. బీ అర్ ఎస్ సైతం దయాకర్ రావును పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే కొద్ది రోజులుగా దయాకర్ రావు పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు.


పార్టీ మార్పుపై క్లారిటీ..


కాంగ్రెస్ లో చేరికలపై ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చిన ఎర్రబెల్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా తొర్రూరులో ఎర్రబెల్లి ముఖ్య నేతలు, అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మీడియాకు అనుమతి లేదని చెప్పారట. అంతే కాకుండా సమావేశంలో ఉన్నవారు ఫోటోలు, వీడియో లు తీయవద్దని హెచ్చరించారట. సమావేశాల్లో దయాకర్ రావు తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం అవాస్తవమని, కాంగ్రెస్ పెద్దలు తనను సంప్రదించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి  ఇస్తామనారని అనుచరులతో ఎర్రబెల్లి చెప్పినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ లో చేరనని, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని ప్రజలు బీఆర్ఎస్‌ను కావాలని కోరుకుంటున్నారని దయాకర్ రావు చెప్పారని తెలిసింది. 


తాను అమెరికాకు వెళ్దామనుకున్నది వాస్తవమే. అదే సమయంలో రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారు కావడంతో రద్దు చేసుకున్నానని ఎర్రబెల్లి అనుచరులతో తెలిపారట. ఈనెల చివరి వారంలో వెళ్లనున్నట్లు చెప్పినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేశానని కూడా అనుచరులతో అన్నారట. అయితే పార్టీ మార్పుపై దయాకర్ రావు క్లారిటీ ఇవ్వడంతో అనుచరులు, కార్యకర్తలు అందం వ్యక్తం చేశారట.


మరో ప్రచారం లేకపోలేదు
దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జి ఝాన్సీ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయాకర్ రావును పార్టీలోకి తీసుకోవద్దంటూ కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పెద్దలను కూడా కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు దెబ్బతీయాలంటే దయాకర్ రావును కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం తప్పదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు దయాకర్ రావు రాక కోసం పావులు కలుపుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డిలకు ఒక క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దయాకర్ రావు పార్టీలోకి వచ్చిన పాలకుర్తి నియోజకవర్గంతో దయాకర్ రావుకు సంబంధం ఉండదని మీ నియోజకవర్గంలో అడుగుపెట్టడని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.


ఎర్రబెల్లిపై నమ్మకం ఉందా.. ఎపిసోడ్ కు తెరపడుతుందా..?


కొద్ది రోజులుగా దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరగడం.. అంతేకాకుండా పాటు పార్టీలో చేరి అమెరికా టూర్ వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికపై అమెరికా టూర్ పై ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు ముఖ్య కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినా.. కొంత సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దయాకర్ రావు పార్టీ మారడం ఖాయమని, సమయం సందర్భం కోసం చూస్తున్నారని.. ఆలోపు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం కోసం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నియోజకవర్గంలో తిరుగుతూ అనుచరులకు, కార్యకర్తలకు పార్టీ మారనని చెప్తున్నారని అంటున్నారు. 


ఓవైపు కాంగ్రెస్ లోకి దయాకర్ రావు రావడం ఖాయమని.. అయితే పాలకుర్తితో సంబంధం లేకుండా కండిషన్ తో పార్టీలోకి తీసుకొనున్నట్లు పాలకుర్తి నియోజకవర్గం లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం.. మరోవైపు చేరడం లేదని దయాకర్ రావు చెప్పడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో దయాకర్ రావు పార్టీ మారడం పై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.