Warangal Leaders Aruri Ramesh Resigns to BRS: వరంగల్: బీఆర్ఎస్ పార్టీకి మరో నేత షాకిచ్చారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ గూలాబీ పార్టీ (Aruri Ramesh Resigns to BRS)కి రాజీనామా చేశారు. తనకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆరూరి రమేష్ ఓ లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు పార్టీలో అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆరూరి రమేష్ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.


వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే 3 రోజుల కిందట బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్.. ఆరూరి రమేష్ మధ్యలోనే తీసుకెళ్లారు.  దాంతో ఆయన బీజేపీలో చేరిక ఆలస్యమైంది. ఆరూరి రమేష్ ను హరీష్ రావు సూచన మేరకు ఎర్రబెల్లి హైదరాబాద్ తీసుకొచ్చారు. కేసీఆర్ వద్దకు తీసుకెళ్లగా కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతర మీడియాతో మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. బీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వకపోతే ఆరూరి రమేష్ బీజేపీ వైపు మొగ్గుచూపారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీని వీడటంతో ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ ఇదివరకే రెండు జాబితాలు ప్రకటించగా.. 17 స్థానాల్లో 15 సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.