Ex mla Rajaiah car Accident | వరంగల్: స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ కారును నడిపినట్టు సమాచారం. అయితే యాక్సిడెంట్ జరిగిన తరువాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కారు దిగి మహిళను గమనించి వెళ్లారు. కారును కాజీపేట బాపూజీనగర్ లో వదిలివెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


మడికొండకు చెందిన స్వప్న అనే మహిళ ఎస్సీ కాలనీ వద్ద శనివారం రాత్రి రోడ్డు దాటుతోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వప్న అక్కడికక్కడే మృతిచెందింది. చెట్ల మధ్యలోంచి డివైడర్ దాటుతుండగా, అంతగా గమనించని డ్రైవర్ కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కారులోనే ఉన్న రాజయ్య పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయారు. కారును బాపూజీనగర్ లో వదిలి వెళ్లారు. కాగా, రాజయ్య కారు నడిపిన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.