TGPSC CDPO, EO Exams Cancelled: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గతంలో నిర్వహించిన మరో రెండు నియామక పరీక్షను రద్దు చేసింది. గతేడాది  ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో... సిట్ అధికారులు జరిపిన విచారణలో మహిళాశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో ((శిశు అభివృద్ధి ప్రాజెక్టు ఆఫీసర్) (Notification No.13/2022), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (Notification No.11/2022) ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెల్లడైంది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL), ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నివేదిక ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన పరీక్షలు రద్దు చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు జులై 19న అధికారిక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల రీఎగ్జా్మ్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో గతంలోనే గ్రూప్-1, ఏఈఈ, ఏఈ పరీక్షలు రద్దు చేశారు. ఈ పరీక్షలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని అప్పట్లోనే కమిషన్ తెలిపింది. తాజాగా ఈ నివేదిక రావడంతో పరీక్షలు రద్దు చేసింది.


తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖలో 23 సీడీపీవో, 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. సీడీపీవో పోస్టులకు 19,182 మంది;  ఈవో పోస్టులకు 26,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీడీపీవో పోస్టులకు 2023 జనవరి 3న, ఈవో పోస్టులకు జనవరి 8న కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన తుదికీలను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అధికారులు అప్పుడు ఫలితాలను ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన కావడంతో.. సీడీపీవో పోస్టులకు 23 మందితో ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే తాజాగా ఈ పరీక్ష రద్దవడంతో ఎంపిక జాబితా కూడా రద్దు అయినట్లేనని టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. 


పోస్టింగుల సమయంలో పరీక్ష రద్దు..
అయితే గ‌తంలో CDPO పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసినా.. అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో ఈ ప‌రీక్షల్లో విజ‌యం సాధించిన అభ్యర్థులు తమకు పోస్టింగులు ఇవ్వాల‌ని కోర్డును ఆశ్రయించారు. అలాగే ఈ ప‌రీక్ష విజ‌యం సాధించ‌ని అభ్యర్థులు కూడా.. గ్రూప్‌-1 ప‌రీక్షలాగా.. సీడీపీవో ప్రశ్నపత్రం కూడా లీక్ అయింద‌ని అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించారు. అలాగే గ్రూప్‌-1లో మాదిరిగా.. ఈవో ప‌రీక్షలో బ‌యోమెట్రిక్ తీసుకోలేద‌ని, కొంద‌రు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలు, అధికారుల నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దుచేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.


గ్రూప్-2 పరీక్షలు వాయిదా..
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. పరీక్ష వాయిదాకు సంబంధించి టీజీపీఎస్సీ జులై 19న సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించింది.  పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ పేర్కొన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...