ఉద్యమ జిల్లాగా పేరు ఉన్న వరంగల్ జిల్లా అధికార పార్టీ నేతల‌్లో ఎమ్మెల్యేలలోనూ టెన్షన్ నెలకొంది. రానున్న ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఎవరు గెలుస్తారనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే  జిల్లాలో కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీనీ వీడి ఇతర పార్టీలలో జాయిన్ అయ్యారు. ఇంకొందరు జాయిన్ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకీ ఆ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో? 


ఓరుగల్లు ఉద్యమ పార్టీకి షాక్‌లు


హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్‌లో గులాబీ పార్టీకీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి గులాబీ పార్టీకి కాస్తంత పట్టు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ జిల్లా బీఆర్ఎస్‌కు కంచుకోటలా మారింది. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ అధిక్యత ప్రదర్శించిన జిల్లా వరంగల్ జిల్లానే.


ప్రస్తుతం ఉన్న బలాన్ని చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల అభ్యర్థులతోపాటు పదకొండు అసెంబ్లీలకు గులాబీపార్టీ అధీనంలోనే ఉన్నాయి. ఇవే కాక ఎనిమిది ఎమ్మెల్సీలు ఆరు జిల్లా పరిషత్‌లను సొంతం చేసుకొని మిగిలిన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం అందనంత అధిక్యత ప్రదర్శిస్తోంది. ఇలాంటి వేళ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీలో నెలకొన్న అధిపత్య పోరు కారణంగా పార్టీపై వ్యతిరేకత మొదలైంది. ఇతర పార్టీలకి అధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి


ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీటిలో ఇప్పుడు పలు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీలు బలపడ్డాయన్న సర్వే రిపోర్టులు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలు ఇతర పార్టీలకు వెళ్లిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది బీఆర్ఎస్ శ్రేణుల మాటే. ఎన్నికల్లో గెలుపు మీద ఫోకస్ పెట్టిన గులాబీ బాస్‌కు గెలుపే అంతిమ లక్ష్యమైనప్పుడు సిట్టింగుల విషయంలో ఆయన కఠువుగా వ్యవహరించటానికే ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది.


ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశాల్లోనూ గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలకు ఇప్పుడు కంటి మీద కనుకు రాని పరిస్థితిగా ఉంది. ఇటీవల కాలంలో జరిపిన అన్ని సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగానే అనేక స్థానాల ఫలితాలు వస్తాయన్న విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న వేళ.. ఉమ్మడి వరంగల్ జిల్లాపై అటు అధికారపార్టీలోనే కాదు సిట్టింగుల్లోనూ టెన్షన్ మొదలైనట్లుగా చెబుతున్నారు.


రోజులు గడిచే కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇతర పార్టీలు అంతకంతకూ బలపడుతున్నాయనే మాట వినిపిస్తోంది. పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా వస్తున్న ప్రకటనలు ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్దన్నపేటలో ఆరూరి రమేశ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మినహా మిగిలిన వారి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నట్లు ప్రచారం జరుగుతోంది..


సర్వేల్లో ఆదరణ కరవు?


సర్వేల్లో ఆదరణ కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతున్న సిట్టింగులు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో తమ గ్రాఫ్ మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పలువురు మాజీలను కొత్తగా బరిలోకి దింపే ఆలోచన గులాబీ బాస్ ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో.. పోటీ మరింత పెరిగి.. ఎవరికి వారు తామే తగిన అభ్యర్థి అన్న భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు.


ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న క్యాడర్


కొన్ని నియోజకవర్గలలో టీఆర్ఎస్ నాయకుల మధ్య అధిపత్య పోరు చాలా ఎక్కువవడంతో ఏ నాయకునితో టచ్ లో ఉండాలి, ఎన్ని చిక్కులు వస్తాయో అని సెకండ్ క్యాడర్ అయోమయంలో ఉన్నారు. సర్వే రిపోర్ట్ లతో ఎమ్మెల్యేలు... మాకు ఈసారైనా టికెట్ దక్కుతుందో లేదో అని అధికార పార్టీ నేతలను అధిష్టానం ఎలా గాడిన పెడుతుందో...రానున్న రోజులలో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్‌పై  ఫోకస్ ఏమేరకు ఉంటుందో చూడాలీ.