Telangana News: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం పథ‌కం చిత్ర‌విచిత్ర‌మైన స‌న్నివేశాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. నిన్నమొన్న‌టి దాకా ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌లు సీట్ల కోసం సిగ‌ప‌ట్లు ప‌ట్టుకున్న ఘ‌ట‌న‌లు చూశాం. కొంద‌రు ఇంట్లో బోర్ కొడుతుంటే టైం పాస్‌కు బ‌స్ ఎక్కామ‌ని అంటే, ఇంకొకావిడ పిల్ల‌ల‌కు అన్నం తినిపించ‌డానికి బ‌స్సు ఎక్కామ‌ని చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం చూశాం. తాజాగా ఇంకో వీడియో వైర‌ల్ అవుతోంది.


ఇద్ద‌రు మ‌హిళ‌లు సీట్లో హ‌న్మ‌కొండ నుంచి సిద్ధిపేట వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సులో ఒకే సీట్లో కూర్చుని వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ చ‌క్క‌గా ముచ్చ‌ట్లు చెప్పుకుంటున్న వీడియో ఇప్పుడు సామాజిక మాద్య‌మాల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. గ‌మ్యం చేర‌డానికి దాదాపు రెండున్నర గంట‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని సావ‌ధానంగా ఇంటి ప‌నులు బ‌స్సుల్లోనే చ‌క్క‌బెట్టేస్తున్నారు మ‌హిళ‌లు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆర్టీసీ బ‌స్సుకు ఏం ఖ‌ర్మ ప‌ట్టెర నాయ‌నా పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వుకుంటున్నారు. కొంద‌రైతే తీసిన పొట్టు ఎవ‌రి నెత్తిన త‌లంబ్రాలు పొయ్య‌కుండా జ‌ర భ‌ద్రంగా మూట క‌ట్టుకొని పోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.