IT Tower In Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడారన్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 8 కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అనంతరం ఆయా కంపెనీలకు ఐటీ టవర్ లో స్థలాన్ని కేటాయిస్తారు. అంతకు ముందు ఐటీ కారిడార్ వెనక భాగంలో సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం బాలుర జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం శిల్పారామాన్ని పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంకానున్నారు.