Minister KTR: మహబూబ్ నగర్ జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఆయా కంపెనీలకు ఐటీ టవర్ లో స్థలాన్ని కేటాయిస్తారు. అనంతరం కారిడార్ వెనుక భాగంలో సుమారు 270 ఎకరాల్లో నిర్మించనునున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు. ఈ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ నమూనాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుంది.






మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను ప్రారంభిస్తారు. అనంతరం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని కూడా ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలు దేరుతారు. కాగా మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నర్సింహ గౌడ్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు.