వరంగల్: ఈ ఆర్థిక సంవత్సరానికి 2,710 కోట్ల రుణ ప్రణాళికను స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం హైదరాబాదులోని శిల్పారామంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది రాష్ట్ర సర్వసభ్య సమావేశం.
రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఫాలో అవుతున్న శ్రీనిధి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. శ్రీనిధి పేదల పాలిట పెన్నిధిగా పని చేస్తుంది. మన తెలంగాణ స్త్రీ విద్య సంస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు మన శ్రీనిధి ని అమలు చేస్తున్నాయి. 12 సంవత్సరాలుగా శ్రీనిధి అద్భుతంగా పని చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల  సంఘ సభ్యులు శ్రీనిధి నుండి రుణాలు పొందారు. ఈనాటికీ స్త్రీ నిధి రుణాల నిలువ రూ.5,355 కోట్లు అయిందన్నారు. రుణాల నిలువలో 28.20 శాతం వృద్ధి సాధించడం పట్ల అందరికీ అభినందనలు
రాష్ట్రప్రభుత్వం, స్వయం సహాయక సంఘాలు వాటాదారులు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఈ మధ్య 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను విడుదల చేసిందన్నారు. మండల సమాఖ్య కాలపరిమితి మూడు సంవత్సరాలకు పెంచడానికి ఈ జనరల్ బాడీ తీర్మానం చేయాలని కోరారు. అలాగే సభ్యులకు 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా కావాలని అడుగుతున్నందున  పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. రాష్ట్రంలోని పేద మహిళలను మైక్రో ఫైనాన్స్ సంస్థలు  విధించే అధిక వడ్డీ భారం, బలవంతపు వసూళ్ళ బారి నుండి  విముక్తి కల్గించి పేదరిక నిర్మూలనకు పాటుపడడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల మండల/పట్టణ సమాఖ్యలు వాటా దారులుగా ఉద్భవించిన సంస్థ స్త్రీనిధి అన్నారు. ఈ స్త్రీ నిధిని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్న మహిళాసంఘ సభ్యులందరికీ మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా పేదరిక నిర్మూలనలో భాగంగా స్త్రీ నిధి కార్యక్రమాలను సమర్ధవంతంగా సంఘాలకు చేర్చి వారి ఆర్ధికాభివృద్ధికి కృషిచేస్తున్న సెర్ప్/మెప్మా DRDOలు, PDలకు, సిబ్బందికి  ఈనాటి 10వ సర్వసభ్య సమావేశ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్రంలోని నిరుపేద మహిళలకు తక్షణ ఋణ సౌకర్యం కల్పిస్తూ పేద మహిళల ఆర్ధిక, సామాజిక అభివృద్ధికై అహర్నిశలు తోడ్పడుతూ దేశంలోనే ఒక ప్రత్యేకత కలిగిన ఉత్తమ సంస్థగా రూపొందించిన రాష్ట్ర  మహిళా సోదరీమనులందరికి స్త్రీనిధి, సెర్ప్ మరియు మెప్మా సిబ్బందిని అభినందించారు. 


స్వయం సహాయక సంఘాలు, వాటి సమాఖ్యల ఆర్ధిక పరిపుష్ఠి  కొరకు స్త్రీనిధి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. స్త్రీనిధి రాష్ట్రంలో పేద మహిళల ఆర్ధిక అభ్యున్నతిలో కీలకపాత్ర పోషిస్తున్నది. రూ.5000 లతో మొదలుకొని ఆదాయాభివృద్ధి జీవనోపాదులకొరకు గరిష్టంగా రూ. 3 లక్షల వరకు స్త్రీనిధి నుంచి ఋణం పొందవవచ్చు అన్నారు. ఈ రుణాల సదుపాయాలలో స్త్రీనిధి ద్వారా అధికమొత్తం ఋణాలు జీవనోపాధి నిమిత్తం ఇవ్వడానికి వీలుంటుంది. ఇందువలన సభ్యులు ఆదాయం పెంచుకోవచ్చు అని సూచించారు. ఇది 31.03.2021 నాటికి ఉన్న రుణాల నిల్వ రూ. 4 వేల 177 కోట్ల తో పోలిస్తే 28.20% వృద్ధి నమోదైంది. సంఘ సభ్యులందరి సమిష్టి కృషితో రూ.115 కోట్ల 59 లక్షల నికర ఆదాయం పొంది 14% డివిడెంట్ వాటాదారులైన మండల/పట్టణ సమాఖ్యలు రూ. 38 కోట్ల 52 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 6 కోట్ల 9 లక్షలు చెల్లించడం అత్యంత ప్రశంసనీయం అన్నారు.


14 నుంచి 11 శాతానికి వడ్డీ తగ్గింపు 
ప్రతి మహిళా తాను తీసుకున్న రుణాన్ని సరియైన పద్దతిలో ఉపయోగించుకొని లభించే ఆదాయంలో నుండి క్రమంతప్పకుండా అప్పు వాయిదాలు చెల్లించి తమ కుటుంబ ఆర్ధిక అభివృద్ధి, మన స్త్రీనిధి సంస్థ అభివృద్ధికి పాటుపడాలి. స్త్రీనిధి ఋణాలలో (100%) వంద శాతం రికవరీ సాధించాలి. సభ్యుల పై వడ్డీ భారాన్ని తగ్గించుటకు స్త్రీనిధి ఋణాలపై వడ్డీని క్రమంగా 14% నుండి 11% కి తగ్గించామన్నారు. 


స్త్రీనిధి నుండి సభ్యుల ఉపాధి అవసరాలకు మాత్రమే కాకుండా, ఇంటి మరమత్తుల కొరకు రూ. ఒక లక్ష, గృహాల సౌరవిధ్యుత్ వసతి కల్పించుటకు, ఎలక్ట్రిక్ -ఆటోలు మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్లు లాంటి పర్యావరణహిత కార్యక్రమాల కొరకు గరిష్టంగా రూ.75 వేల నుండి రూ. 3.00 లక్షల వరకు ఋణాలు పొందవచ్చు అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడానికి స్త్రీనిధి ని అర్హత కలిగిన సంస్థగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం అమలులో స్త్రీనిధి దేశంలోనే ఆగ్రగామిగా నిలిచి ప్రశంసలందుకుందన్నారు. స్త్రీనిధి పేద మహిళలకు కావలసిన రుణాలను అందించడమే కాకుండా వారికి “స్త్రీనిధి సురక్ష పథకం” ద్వారా ఆర్ధిక రక్షణ కల్పిస్తుందన్నారు. 


ఒకవేళ రుణం తీసుకున్న సభ్యురాలు మరణించినట్లైతే తీసుకున్న అప్పులో  నిల్వ మొత్తాన్ని రద్దుచేసి సభ్యురాలు అంతవరకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇది స్త్రీనిధి సంస్థ ప్రత్యేకత. మరే ఇతర సంస్థలలో ఇలాంటి సౌలభ్యం లేదు. రాష్ట్రంలో 1 వెయ్యి 30 బ్యాంక్ కరస్పాండెంట్ కేంద్రాలను  నెలకొల్పి వాటిలో అధికశాతం కేంద్రాలను సంఘ సభ్యుల ద్వార నిర్వహిస్తూ వారు సగటున నెలకు  రూ. 12 వేల ఆదాయం పొందుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఈ సంవత్సరంలో  85 కోట్ల 25 లక్షల లావాదేవీలు జరిపారు. పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి 1 కోటి అయినా రుణాలివ్వడానికి స్త్రీనిధి కృషి చేయాలని, పెద్ద పెద్ద సర్వీస్ సెంటర్లు, మాల్స్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని స్త్రీనిధి MDని కోరారు మంత్రి ఎర్రబెల్లి. స్త్రీ నిధి కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు అధికారులు, ఉద్యోగులకు  అవార్డులు ప్రదానం చేశారు.


ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి, పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, శ్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరా, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఏపీ మాస్ అధ్యక్షులు సి ఎస్ రెడ్డి, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, శ్రీనిధి ఉపాధ్యక్షులు రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, మేనేజింగ్ కమిటీ సభ్యులు, డిఆర్డిఓలు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.