జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంటే కాసేపటికే భర్త కూడా గన్‌తో కాల్చుకొని తనువు చాలించారు. 


జనగామ పట్టణంలో ఎస్సైగా పని చేస్తున్న కాసర్ల శ్రీనివాస్‌, భార్య స్వరూపతో కలిసి వెంకన్నకుంటలో నివాసం ఉంటున్నారు. తెల్లవారు జామున ఎస్సై శ్రీనివాస్ లేచి చూసేసరికి బాత్రూంలో భార్య ఉరివేసుకొని విగతజీవిగా పడి ఉన్నారు. దాన్ని చూసి షాక్ అయిన శ్రీనివాస్‌.. విషయాన్ని బంధువులకు చెప్పారు. 


భార్య మరణంతో బోరున విలపించారు. బంధువులు, స్నేహితులు శ్రీనివాస్‌ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఈ పరామర్శలు జరుగుతుండగానే... వాష్‌రూంకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారు. ఇంతలో గన్ సౌండ్ వినిపించింది. ఏమైందో ఏమో అని స్నేహితులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీనివాస్ పడి ఉన్నారు. 


డోర్‌ తెరిచి చూస్తే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్టు గుర్తించారు. గంటల వ్యవధిలోనే భార్యభర్త ఇలా సూసైడ్‌ చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 


రెండు ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఎస్సై దంపతుల మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరుగుపొరుగు వారి నుంచి, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 


భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని రాత్రి కూడా ఏదో తగాదా జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఈ కారణంతోనే ఎస్సై దంపతులు సూసైడ్ చేసుకొని ఉంటారని సమాచారం. వివాదాలతో భార్య చనిపోతే... ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త చనిపోయి ఉంటాడని చెప్పుకుంటున్నారు.