తెలంగాణ రాష్ట్రంలో SSC హిందీ పేపర్ లీక్ రాజకీయ దుమారం రేపుతోంది. ఇది లీక్ కాదు మాల్ ప్రాక్టీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో అర్దమవుతోంది. మంగళవారం నిందితుడు ప్రశాంత్ తో పాటు హిందీ పేపర్ పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ఫొటోలు తీసి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారంటూ ఘటనతో ప్రమేయమున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పోలీసులు.


మంగళవారం అర్దరాత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో మార్చుతూ అనేక ప్రాంతాల్లో తిప్పారు. చివరికి వరంగల్ తీసుకెళ్లారు. ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. బండి సంజయ్ అరెస్ట్ పై భిన్న వాదనలు విపిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ నుంచి నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో వాట్సప్ నకు మెసేజ్ చేస్తే,, ఆ మెస్సేజ్ చూసినంత మాత్రానికే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తారా.. ? అని బిజెపి నాయకులు భగ్గుమంటున్నారు. వరంగల్ పోలీసులు మాత్రం ఇవేవీ తమకు పట్టవన్నట్లుగా పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.  


బండి సంజయ్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది. బండిని ఎందుకు ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారనే ప్రశ్నలకు పోలీసుల నుండి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే.. SSC హిందీ పేపర్ లీక్స్ లో వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి. అందుకే అదుపులోకి తీసుకున్నాం అన్నారు. పూర్తి స్దాయిలో ఆధారాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే సంజయ్ పై సెక్షన్ 420IPc తో పాటు మాల్ ప్రాక్టీస్ యాక్ట్ లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.






తాజాగా ఈ కేసులో బండి సంజయ్ వాట్సప్ చాటింగ్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హిందీ పేపర్ లీకైనట్లు వార్తలు సృష్టించి, తానే ఫొటో తీసిన కాపీని అన్ని గ్రూపులలో షేర్ చేశాడు నిందితుడు ప్రశాంత్ . అదే నిందితుడు తన ఫోన్ నుండి బండి సంజయ్ కు సైతం 11 గంటల దాటాక వాట్సప్ లో హిందీ పేపర్ బండి సంజయ్ కు పంపించాడని, అతడు బీజేపీ కార్యకర్తనా కాదా అని హరీష్ రావు సైతం ప్రశ్నించారు. ఈ కేసులో డొంక కదిలించేందు ప్రయత్నిస్తున్న వరంగల్ పోలీసులకు వాట్సప్ చాటింగ్ దొరికింది. దీంతో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ ను రీట్రీవ్ చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ కు ఒకరోజు ముందు బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ చేసినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తెలినట్లు సమాచారం.


పేపర్ లీక్ ముందు బండి సంజయ్ , ప్రశాంత్ తో ఏ విషయంపై చాటింగ్ చేశాడు. వీరిద్దరి చాటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో 2 గంటల సమయంలో 142 సార్లు ప్రశాంత్ ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడు. కేవలం వాట్సప్ చాటింగ్ మాత్రమే కాదు ఏకంగా సంజయ్ తో వందకు పైగా ఫోన్ కాల్స్ ప్రశాంత్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. హిందీ పేపర్ పంపిన తరువాత కూడా బండి సంజయ్, నిందితుడు ప్రశాంత్ ఫోన్ లో మాట్లాడినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ తో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులు కోర్టుకు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు.


హిందీ ఎగ్జామ్ మొదలైన కొంత సమయానికే నిందితుడు క్వచ్ఛన్ పేపర్ ఫొటో తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు. అందరి లాగే బండి సంజయ్ కు పేపర్ వాట్సప్ చేశాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఎగ్జామ్ ముందురోజు చాటింగ్, ఫోన్ కాల్స్, ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోనూ బండి సంజయ్, నిందితుడు ప్రశాంత్ ఫోన్ కాల్స్, వాట్సప్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నారని మంత్రులు ఆరోపించారు. పేపర్ లీక్ తరువాత సరే , ఓ రోజు ముందు బండితో ప్రశాంత్ కు ఏం పని, ఏం మాట్లడారు. పేపర్ లీక్ పై చర్చించారా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగానే ఈ కేసులో సంజయ్ ప్రమేయం ఉందని నిర్ధారణ అయితే ఈకేసు ఊహించని మలుపు తీసుకోవడం ఖాయం. 


ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ పై బిజెపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు సైతం కావడంతో పేపర్ లీక్ కేసులో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఎగ్జామ్ పేపర్లు లీక్ కావడం లేదని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో ఆధారాలను కోర్టుకు సమర్పించేందుకు వరంగల్ పోలీసులు సర్వం సిద్దం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్ కు, బండి సంజయ్ కు లింకేంటి అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.