Revanth Reddy: రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత పరిస్థితీ చాలా అధ్వాన్నంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు వాట్సాప్ లో, టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరుకుతున్నాయంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో చెప్పారు. అలాగే భూములు, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు కొల్లగొట్టి.. ఇప్పుడు నిరుద్యోగులు, యువత జీవితాలను నాశనం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈ ప్రశ్నా పత్రాల లీకేజీకి సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ యే కారణం అని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతీ ఇవ్వలేదని అన్నారు. 






తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేందుకు ప్రాణాలను బలి ఇచ్చింది బడుగు, బలహీన వర్గాల ప్రలని రేవంత్ రెడ్డి వివరించారు. సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టామని కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని... కానీ పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం పెడతామని వీహెచ్ అడిగితే ఎందుకు అనుమతింలేదని నిలదీశారు. మంత్రి వర్గంలో ఒక్క మాదిగకు కూడా చోటు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని తాకేందుకు కూడా సీఎం కేసీఆర్ కు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కట్టినట్లు తెలిపారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వస్తే ఎంపీగా గెలిపించినట్లు గుర్తు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం పాలమూరు అవమానించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 






పాలమూరు బిడ్డకు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీ బిడ్డను చంపుకుంటారో, చక్కగా సాధుకుంటారో మీ ఇష్టం అని అన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సరూర్ నగర్ లో విద్యార్థి నిరుద్యోగ, నిరసన ర్యాలీకి మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ వస్తున్నారని.. పాలమూరు నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, రాములు నాయక్, మల్లు రవి, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.