Minister Konda Surekha News: మెదక్ జిల్లా నర్సాపూర్ కొల్చారం మండలంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటన సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ కొల్చారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని మంత్రి కొండా సురేఖ ప్రయత్నించారు. కానీ, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని ఆమె అడ్డుపడ్డారు.


దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ​కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి అనుచరుల మధ్య బాహాబాహీకి దారితీసింది. మరోవైపు, స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. వేదిక మీద స్థానిక ఎంపీటీసీ అరుణకు కుర్చీ వేయలేదు. కానీ ప్రోటోకాల్ లేనివారు స్టేజీ మీద ఉన్నారని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో వివాదం మొదలైంది. 


వేదిక పైన నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ గౌరీ శంకర్, జడ్పీటీసీ భర్త సంతోష్ కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. పరస్ఫర దాడి కూడా చేసుకున్నారు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. ఈ సమయంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఆదరాబాదరగా విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేసేసి.. వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కొత్తగా నిర్మించిన ఎంపీడీవో ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి వెంట.. రాజిరెడ్డి ఉండటంపై ఎమ్మెల్యే సునీతారెడ్డి అభ్యంతరం తెలిపారు.


 కాగా మంత్రి మనం తరువాత మాట్లాడుకుందాం అంటూ రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ లోనికి వెళ్లిపోయారు. స్కూల్ వద్ద జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని పోలీసులు  కాంగ్రెస్, బీఆర్ఎస్  నాయకులెవరినీ ఎంపీడీవో ఆఫీస్ లోనికి అనుమతించ లేదు. దీంతో ఇరుపార్టీల నాయకులు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి, ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాక పరిస్థితి సద్దుమణిగింది.