Medico Preethi Case: మెడికల్ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి పోస్టుమార్టం నివేదిక వచ్చిందని, ఇందులో కీలక విషయాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీటును దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సీనియర్ సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ప్రీతి బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ నకు కోర్టును బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 19వ తేదీన షరతులకో కూడి బెయిల్ ఇచ్చారు. అయితే పూచీకత్తు, సంతకాల విషయంలో జాప్యం జరగడంతో విడుదల ఆలస్యమైంది. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్ ను పోలీసులు గురువారం వరంగల్ కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ ఉత్తర్వుల కాపీ వరంగల్ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో సైఫ్ ను కోర్టు నుంచి ఖమ్మం జైలుకు తీసుకువచ్చి సంతకాలు తీసుకొని సాయంత్రం ఆరు గంటల సమయంలో సైఫ్ ను విడుదల చేశారు. అయితే.. సీపీ ప్రకటనపై ప్రీతి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



అసలేం జరిగిందంటే..?


గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది.


మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషపు ఇంజెక్షన్ చేశారని.. డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించి ట్రీట్మెంట్ చేశారంటూ ప్రీతి తండ్రి, సోదరుడు ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదన్నారు. ఫిబ్రవరి 26 రాత్రి ప్రీతి  బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా 


ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వపరంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో రూ.20 లక్షలు ప్రకటించారు.  వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు.