MLA Banoth Shankar Naik: మహబూబాబాద్ పట్టణ శివారులోని 9, 10 వార్డులో శనిగపూరం, బోడ తండాలను ఈరోజు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సందర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే తండావాసులంతా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను చుట్టు ముట్టారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించ లేదంటూ నిలదీశారు. గత 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేరని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వివరించారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్యలు మాత్రం తీర్చలేదంటూ ఫైర్ అయ్యారు.


గతంలో పని చేసిన ఎమ్మెల్యే రాం భద్రయ్య ఆధ్వర్యంలో ఆభివృధ్ధి జరిగిందని.. ఆప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆభివృధ్ధి జరగలేదని ప్రజలు అరోపించారు. ఎలక్షన్ సమయం దగ్గరకి రావడంతోనే నేతలంతా గ్రామంలోకి వస్తున్నారని.. తమ సమస్యల ను పరిష్కరించకపోతే తమ ఊర్లోకి రావద్దంటూ తండ వాసులు హెచ్చరిస్తున్నారు. అయితే బోడ తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ హామీ ఇచ్చారు.


ఇటీవలే మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ప్రజలు


రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటిఆర్ ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా సిరిసిల్లలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఏబీవీపీ నాయకులను ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. 


మరోవైపు ఇదే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా పలువురు నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ నోటికి నల్లగుడ్డ కట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న దళితులను మాత్రం మరిచిపోయిందని వాపోయారు. దళిత బంధు పేరిట ఓట్లు దండుకోవాలని పథకాన్ని ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే సాయం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట దళితులు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదాని అని ప్రశ్నించారు. ఓట్లు వేస్తేనే కదా కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలంలోని పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు కింద ఎంపిక చేసి ఆ ఊరిలో మాత్రమే దళితబంధు అమలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్, అందె వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు, మస్కురి దేవయ్య, ఏర్పుల తిరుపతి, బక్కి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.