Medaram Medical Camp: మేడారం జనజాతరను తలపిస్తోంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. కుంభమేళా(Kumbha Mela)ను తలపించే రీతిలో లక్షలాది జనం పోటెత్తారు. మేడారం వెళ్లేదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇంతపెద్దఎత్తున జనం ఒకచోట గుమిగూడటంతో పాటు జంపన్న వాగులో సామూహిక స్నానాలు ఆచరిస్తుండంతో  అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.అలాగే జనం ఒత్తిడికి భక్తులు సొమ్మసిల్లిపడిపోతున్నారు. అలాంటి వారి కోసం మేడారం(Medaram)లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.


అందుబాటులో వైద్యం
కుంభమేళాను తలపించే మేడారంలో భక్తులు సదుపాయాలు అందించడం ఎంతో కీలకం. అత్యవసర ప్రాథమిక చికిత్స సత్వరం అందించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే తెలంగాణ(Telangana) ప్రభుత్వం పెద్దఎత్తున వైద్య శిబిరాలు(Medical Camp) ఏర్పాటు చేసింది.మేడారంలోని టీటీడీ కల్యాణమండంపలో 50 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసింది. అయితే జాతర(Jathara)కు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది అశుభ్రమైన తినుబండారాలు, నీరు తాగి డయేరియాకు గురయ్యారని వైద్య బృందాలు వెల్లడించాయి. ఎక్కువ మంది విరోచనాలతో బాధపడ్డారని తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని వైద్యశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.  జాతరలో వివిధ ప్రాంతాల్లో 40 ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఎమర్జెన్సీ సమయంలో భక్తుల వద్దకు వెళ్లేందుకు 40 మొబైల్ అంబులెన్సులు, ఇరవై 108 వాహనాలను జాతరలో నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు గద్దె ల సమీపంలో అన్ని విభాగాలకు చెందిన వైద్య సిబ్బందితో  నాలుగు రోజుల పాటు జరిగిన జాతరలో భక్తులకు నిరంతర సేవలందిచారు. భక్తులు సైతం నిరంతర ఉచిత వైద్య శిబిరాల వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకొని మందులు తీసుకువెళ్ళారు. 


భక్తుల అస్వస్థత
ఎండ వేడికి తోడు ఉక్కపోతతో మేడారం(Medaram) భక్తుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు తోసుకోవడంతో పాటు...గంటల కొద్దీ క్యూలైన్ లో నిల్చుని నీరసించిపోయారు. అలాగే సమయానికి తినకపోవడం, అపరిశుభ్రవాతావరణంలో తినడం వల్ల భక్తులు విరోచనాలతో బాధపడ్డారు. కొందరు భక్తులకు ఫిడ్స్ రాగా...మరికొందరు గుండెపోటుకు గురయ్యారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న భక్తులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. బీపీ, షుగర్ ఉన్న భక్తుల కోసం వైద్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  


నిరంతరం వైద్య సేవలు
జాతర జరిగినన్ని రోజులు నిరంతర వైద్య సేవలు అందించినట్లు  వైద్యాధికారులు తెలిపారు, ఒక్కో షిప్ట్ లో 50మంది చొప్పున విధులు అందించారు.  ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన వారిని ములుగు ఏరియా ఆస్పత్రితోపాటు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చిన్నపాటి వైద్య సేవలను వైద్య శిబిరంలోనే అందించినట్లు వైద్యధికారులు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవుడి దయతో ఎలాంటి విపత్తులు సంభవించలేదని వారు వెల్లడించారు.