ఆసియా(Asia)లోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara)కు ఏర్పాట్లు ఘనంగా చేసింది తెలంగాణ సర్కార్(Telangana Govt). ఇప్పటికే మేడారం జాతరకు సామాన్యులు, సెలబ్రేటీలు క్యూలు కడుతున్నారు.  మేడారం సమ్మక్క సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ, తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు.


చాలా మంది వ్యక్తిగత కారణాలతో, కరోనా టైంలో ప్రయాణాల  చేయడం శ్రేయస్కరం కాదన్న భావనతో మేడారం జాతరకు వెళ్లలేకపోతున్నారు. వెళ్లలేమనే బాధ వద్దంటోంది ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటి వద్ద మొక్కులను తీసుకొని జాతర జరిగే ప్రదేశానికి చేరుస్తామంటోంది. అక్కడ ప్రసాదం కూడా తిరిగి చెల్లిస్తామంటోంది. 






అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించు కోనున్నమని మంత్రి  తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… భారత పోస్టల్ సర్వీసు, ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం- బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్లీ దాన్ని భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు.


ఆన్ లైన్‌లో మీ-సేవ లేదా టీయాప్ ఫోలియో(మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని )లో బుక్​ చేసుకోవాలన్నారు. అనంతరం భక్తులకు పోస్టల్ సేవల ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్‌కు భక్తులు రూ.225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటోను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఇంటికే ప్రసాదం అందించనున్నామని.. ఈ సేవలను భక్తులు నియోగించుకోవాలని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు.