Jangaon MLA Muthireddy Yadagiri Reddy: నేతలు చేసే పనులు మాత్రమే కాదు వారి మాటలు కూడా ఆదర్శంగా ఉండాలి. లేకపోతే నలుగురిలో నవ్వులపాలు కాక తప్పదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బూతు పురాణం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కడుపునకు అన్నం తింటున్నారా, లేక గడ్డి తిని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మండిపడుతున్నారు.


ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 
జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో రూ.1.50 కోట్లతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే తిట్ల దండకం మొదలుపెట్టడంతో కంగుతిన్నారు గానుగుపహాడ్ గ్రామ ప్రజలు. కాంగ్రెస్, బీజేపీ నేతలను దూషిస్తూ, వారిని ఒక్కరిని కూడా గ్రామం లోకి రానివ్వొద్దంటూ ఆవేశంతో ఊగిపోయారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.


మరిన్ని పనులు చేయించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని స్థానికులు కోరగా ఆయన ఏమన్నారంటే.. చేతికి పైసలు వస్తలేవు. ఉంటే ఏ పనులైనా చేయిస్తాం అన్నారు. కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ త్వరగా డెవలప్ కావడంతో వాళ్ల కళ్లు మండుతున్నాయన్నారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం మనకు మన పైసలు తిరిగి ఇస్తలేదని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లను, బీజేపీ నేతలను గ్రామం లోనికి రానివ్వొద్దని గ్రామస్తులకు సూచించారు. తెలంగాణ పైసలు తిరిగి మనకు ఇవ్వకుండా ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్ లాంటి వేరే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని చెప్పారు. 


మనం మంచిగా బతుకుతుంటే సూడలేకపోతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలపై బూతు పురాణం మొదలుపెట్టే సరికి షాకవ్వడం గ్రామస్తుల వంతైంది. మా నిధులు మాకు ఇవ్వకుండా, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతల్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన కష్టం వాళ్లు ఎలా తీసుకుంటున్నారు, మా రాష్ట్రం పైసలు, నిధులు మాకు తెప్పించాలని బీజేపీ నేతల్ని నిలదీయాలని ప్రజలకు సూచించారు. కానీ ఈ క్రమంలో ఆయన తిట్ల దండకం, బూతు పురాణం కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.


ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బూతు పురాణంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఫైర్
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని చెప్పారు. కేంద్రం నిధులపై బీజేపీ ఎప్పటికప్పుడూ రాష్ట్రానికి సమాచారం అందించిందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. అవినీతి ఎమ్మెల్యేవి, నీ భూకబ్జా వివరాలు త్వరలోకి బయటకు తీస్తామంటూ దశమంతరెడ్డి హెచ్చరించారు. తమపై రాయలేని భాషలో మాట్లాడిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలే వారికి బుద్ధి చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.