Warangal Crime :వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని  ఎస్ఆర్  ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో దొంగతనం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ రూమ్ లోకి వెళ్లిన దుండగులు విద్యార్థుల సెల్  ఫోన్స్, ల్యాప్ ట్యాప్ లు ఎత్తుకెళ్లారు. గర్ల్స్ హాస్టల్ లో సెక్యూరిటీ లోపానికి ఈ ఘటనలు నిదర్శనం అంటున్నారు విద్యార్థులు. వరుసగా నాలుగు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం దొంగతానికి పాల్పడిన దుండగుడు తప్పించుకునేందుకు ప్రయత్నించి వ్యవసాయ బావిలో పడ్డాడు. హాస్టల్ లో మూడు సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ చోరీ జరిగిందని విద్యార్థులు తెలిపారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా బావిలో పడ్డాడు దొంగ. బావిలోంచి దొంగను బయటకు తీసి అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిని దొంగలను అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఇద్దరు హైదరాబాద్ కు చెందివారుగా గుర్తించారు. 


నలుగురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు 


 ఏపీలోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాజమండ్రికి చెందిన ఒక మైనర్ తో సహా నలుగురు అంతర జిల్లా దొంగలు ఉన్నారు. పట్టుబడిన నిందితులనుండి 7 లక్షల 75 వేల రూపాయల విలువైన సొత్తు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి అమలాపురం డీయస్పీ వై మాధవ రెడ్డి తెలిపారు. నిందితులపై 14 కేసులున్నట్లు చెప్పారు. రాజమండ్రికి చెందిన గొర్రెల చినబాబు, టేకుమూడి దుర్గా ప్రసాద్, ఉప్పులూరి భాస్ర శివరాజు లతొ సహా ఒక బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. వీరిపై వివిధ జిల్లాల్లోని ఎనిమిది పోలీస్టేషన్ల పరిధిలో 14 కేసులు ఉన్నాయని డీయస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 56.7 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 3 కిలోల వెండి, 20 వేల రూపాయల నగదు, రెండు మోటార్ సైకిళ్లు లక్ష రూపాయల విలువ చేసే ఇతర సామగ్రీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 


గ్యాస్ కట్టర్ తో తాళాలు పగలకొట్టి 


గుంటూరు లక్ష్మీపురం మహావీర్ జ్యూవెలరీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.షేక్ ఆలీ, చిలకా రత్నరాజులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి ఒక కేజి 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల 35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహావీర్ జ్యూవెలరీ దుకాణం షట్టర్ ను తొలగించి దుండగులు చోరీకి పాల్పడ్డారు.ఈ ఇద్దరు నిందితులు  గతంలో ఏటీఏం చోరికి యత్నం, మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో  ముద్దాయిలుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. గ్యాస్ కటర్ తో తాళాలను కట్ చేసి నగదు, బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నవంబర్ లో జరిగిన ఈ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు తాపీగా తమ పని ముగించారు. షేక్ లీ పాత గుంటూరుకు చెందని వ్యక్తి.. అతడు టింకరింగ్ షాపులో పనిచేస్తాడు. ఇక మరో నిందితుడు చిలకా రత్నరాజు  లారీ డ్రైవర్. అయితే వీరిద్దరి ప్రవృత్తి నేరాలు కావటం విశేషం. మొదట్లో ఇద్దరు వేర్వేరుగా చిల్లర నేరాలు చేసేవారు. అయితే వాటి ద్వారా ఎక్కువ ఆదాయం లభించకపోవటంతో ఇద్దరు కలుసుకొని నేరాలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా నవంబర్ 20వ తేదీన రాత్రి లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న మహావీర్ జ్యూయలరీ షాప్ తాళాలను గ్యాస్ కటర్ తో కట్ చేసి దొంగతానికి పాల్పడ్డారు. చాలా ఈజీగా తమ పని ముగించారు. నిందితులు గ్యాస్ కట్టర్ తో తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లి కేజీకి పైగా బంగారం దోచుకుంటుంటే ఎవ్వరికి అనుమానం రాలేదంటే వారి టాలెంట్ ఏంటో అర్దం అవుతుంది.