Hanmakonda 7th Division Corporator Vemula Srinivas arrest:
- ఖాళీ భూమి కనపడితే కబ్జాల పర్వం
- వరంగల్ లో రెచ్చిపోతున్న అధికార పార్టీ లీడర్లు
- రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అనుచరుడి అరెస్ట్
- హన్మకొండలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్ట్


వరంగల్ : వరంగల్ ట్రై సిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి హంగామా చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు ఈ వ్యవహారల్లో జోక్యం చేసుకుని కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భూ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాకు పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదు మేరకు నాన్​బెయిలబుల్​కేసులు నమోదు చేసిన పోలీసులు సెకండ్ అడిషనల్​జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్​మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంతరం వేముల శ్రీనివాస్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.


200 గజాల భూమి కబ్జా... డెవలప్ మెంట్ పేరుతో హై డ్రామా
హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ​డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్​మీదికి వెళ్లి కాంపౌండ్​వాల్​ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


మంత్రి హరీష్ రావుతో వేముల శ్రీనివాస్ ఫైల్ ఫొటో
విచారణ జరిపిన పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్​ఆదేశాలతో కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్​తో పాటు అతడి డ్రైవర్​ పడాల కుమారస్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో  నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​ జేఎఫ్​సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్​ఆదేశాలతో ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్ ను తరలించారు.