నేటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి తొలుత శుక్రవారం (ఫిబ్రవరి 11) జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. 


సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ.. ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ అంశంపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. బడ్జెట్ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని ఏకిపారేసిన కేసీఆర్.. తాజాగా మోదీ తెలంగాణ బిల్లుపై చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 


జనగామలో సీఎం పర్యటన కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జనగామ పట్టణం అంతా గులాబీమయం అయింది. సభకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ ‌తో పాటు ఆలేరు, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తగ్గేదేలే, ఇది కేసీఆర్ అడ్డా, అని భారీ బెలూన్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.






ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ బందోబస్తు
జనగామలో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనను అడ్డుకునే అవకాశాలు ఉన్న వేళ జిల్లాకు చెందిన బీజేపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.