BRS Chief KCR says by elections for Station Ghanpur- తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ లో బస్సు యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ కు ఉప ఎన్నిక రావటం ఖాయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ MLA కావటం ఖాయం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లోకి పోయిండు, ఆయన రాజకీయ జీవితం సమాధి అయ్యింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 




సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ ఘనపూర్ లో 3 నెలల్లో ఉప ఎన్నిక తప్పదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ ఉప ఎన్నికల్లో మన బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య అని కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పాలనపై, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సెటైర్లు వేశారు. ఒకామె ఏరికోరి మొగుణ్ణి తెచ్చుకుంటే.. వాడు ఆమెని ఎగిరెగిరి తన్నిండట అని.. కాంగ్రెస్ ను తెచ్చుకున్నక రాష్ట్రంలో పరిస్థితి అట్లనే ఉందని తనదైనశైలిలో పంచ్ లు పేల్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదు, రైతు బంధు రాలేదు, కాంగ్రెస్ హామీ ఇచ్చిన పింఛన్ కూడా రావడం లేదని ప్రజలు చెబుతున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి జనం ఏం అంటున్నారో వినాలని కేసీఆర్ సూచించారు.


కడియం ఎందుకు పార్టీ మారాడు..
ఓ వ్యక్తిని నమ్మి మనం టికెట్ ఇచ్చాం. ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినం. కానీ ఆయన ఎందుకోసం పార్టీ మారిండు. ఆయన చేసిన మోసానికి, తనకు తానే సొంతంగా కడియం శ్రీహరి రాజకీయ సమాధి చేసుకున్నారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి, రాజయ్య మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కడియం కాంగ్రెస్ లో చేరాడని, కానీ ఆ పార్టీ ఆట కొన్ని నెలల్లో ఖేల్ ఖతం అవుతుందని కేసీఆర్ చెప్పారు.


గోదావరిని ఎత్తుకుపోతాడంట మోదీ..
మన భవిష్యత్తు గోదావరి నది. కానీ గొంతుకోస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ గోదావరిని ఎత్తుకుపోతా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి. మీరు ఎట్ల గోదావరిని తీసుకపోతారు అని ప్రశ్నించాలి, పోరాటం చేయాలన్నారు. కానీ చేతగాని రేవంత్‌ రెడ్డి సర్కారు నోరుమూసుకున్నదని చెప్పారు. దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే కృష్ణా నది నీళ్లను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందన్నారు. ఇప్పుడు గోదావరిని సైతం తీసుకుపోతుంటే మూతి మూసుకుని రేవంత్ రెడ్డి కూర్చున్నారంటూ మండిపడ్డారు. నరేంద్ర మోదీకి 200 సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు మొత్తం మనమే నెగ్గితే తెలంగాణ కోసం గట్టిగా పోరాటం చేస్తామన్నారు.


ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చిందని సమైక్యవాదుల పాలనలో అభివృద్ధిలో ఆగమయమైపోయిందని కేసీఆర్ అన్నారు. వరంగల్ నగరంలో 24 అంతస్తుల మల్టీస్పెషల్టి హాస్పిటల్ నిర్మించుకున్నాం, వరంగల్ కు హెల్త్ యూనివర్సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తీసుకువచామని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీ లను తెచ్చుకున్నాం అన్నారు.






Also Read: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్